-
10వ తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత
-
గత ఏడాదితో పోలిస్తే 1.47 శాతం అధికం
-
బాలికల్లో 94.26% ఉత్తీర్ణత.. బాలురు 91.32%
-
40 శాతం పాఠశాలల్లో 100% ఫలితాలు
-
అధిక ఉత్తీర్ణతతో రికార్డు సాధించిన గురుకులాలు
-
జూన్ 3-13 దాకా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
-
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు 15 దాకా చాన్స్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ మాదిరిగానే పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థులు అదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవ్వగా.. రికార్డు స్థాయిలో 92.78% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది గతేడాదితో పోలిస్తే 1.47% అధికం. గత నెల మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పరీక్షలకు 4,96,374 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏటా మాదిరిగానే ఈసారీ బాలురతో పోలిస్తే బాలికలు అత్తుత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 94.26% మంది బాలికలు ఉత్తీర్ణత సాధిస్తే.. బాలల ఉత్తీర్ణత శాతం 91.32కే పరిమితమైంది. జిల్లాల వారీగా ఫలితాలు పరిశీలిస్తే మహబూబాబాద్ 99.29%తో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి, జనగామ, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు నిలిచాయి. 73.97% ఉత్తీర్ణతతో మూడో సారీ వికారాబాద్ జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సీఎం రేవంత్రెడ్డి బుధవారం పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.
గురుకులాల్లో అత్యధికంగా..
గురుకుల విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత శాతం ఈ సారి భారీగా పెరిగింది. 98.79శాతం ఉత్తీర్ణతతో తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల సంస్థ ప్రథమ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో బీసీ సంక్షేమ గురుకులాలు(97.79ు), సాంఘిక సంక్షేమ గురుకులాలు(97.71ు), గిరిజన గురుకులాలు(97.63ు), మైనార్టీ గురుకులాలు(96.57ు) నిలిచాయి. ఇక, ప్రభుత్వ పాఠశాలల్లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. సర్కారు పాఠశాలలకు చెందిన మొత్తం 22,079 మంది పరీక్షలకు హాజరవ్వగా.. 18,729 (84.83ు) మంది మాత్రమే పాసయ్యారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో 1,35,849 మందికి 1,21,089 మంది(89.13ు), ప్రైవేటు పాఠశాలల్లో 2,36,311 మందికి 2,22,633(94.21ు) మంది పాసయ్యారు. కేజీబీవీల్లో 94.42శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95శాతం, ఆదర్శ పాఠశాలల్లో 95.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 11,554 పాఠశాలలు ఉండగా.. 4,629(40.06ు) పాఠశాలలు పూర్తి ఉత్తీర్ణత సాధించాయి. రెండు ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం ఏ ఒక్కరూ పాస్ కాలేదు.
తెలుగులో 6,827 మంది ఫెయిల్
పదో తరగతి పరీక్షల్లో మొత్తం 48,558మంది ఫెయిల్ అయ్యారు. గణితం, సామాన్య శాస్త్రం తర్వాత తెలుగులోనూ చాలా మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. గణితంలో 18,975 (3.82%) మంది, సామాన్యశాస్త్రంలో 15,548 (3.13%) మంది, ప్రథమభాషగా ఉన్న తెలుగులో 6,827 (1.38%) మంది పాస్ మార్కులు సాధించలేకపోయారు. తృతీయ భాష ఆంగ్లంలో 4,015 (0.81%), ద్వితీయ భాష హిందీలో 357 (0.7%) మంది ఫెయిల్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో 4,35,138 మంది పరీక్షలు రాయగా.. 4,09,068 (94.01%) మంది ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మాధ్యమంలో 53,559 మంది పరీక్షలు రాయగా.. 44,698 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలతో పోలిస్తే తెలుగు మాధ్యమంలో అత్యల్పంగా 83.46శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాజా ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9-30 నుంచి మద్యాహ్నం 12-30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఫీజును ఈ నెల 16లోపు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షకు సమయం తక్కువగా ఉన్నందున ఫెయిలైన విద్యార్థులు రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ ఫలితాల కోసం నిరీక్షించకుండా సాధ్యమైనంత త్వరగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు కోరారు. ఇక, మార్కుల రీకౌంటింగ్. రీ-వెరిఫికేషన్తోపాటు సమాధానపత్రాల నకలు కావాలనుకునేవారు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు రీ కౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్కు రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..