హైదరాబాద్ , ఏప్రిల్ 24: జట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందమైన జుట్టు కోసం ఆడవారితో పాటు మగవారు కూడా తాపత్రయపడుతుంటారు. కానీ మగవారిలో ఎక్కువ శాతం మంది బట్టతలతో బాధపడుతుంటారు. దాని పరిష్కారం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బట్టతలను పోగుట్టుకునేందుకు చికిత్సలు కూడా తీసుకుంటారు. అయితే ఇలాంటి వారిని మోసం చేసే పనిలో పడ్డారు కొందరు వ్యక్తులు. బట్టతలకు వెంట్రుకలు మొలిపిస్తామంటూ నమ్మబలికి క్యాష్ చేసుకుంటున్నారు. బట్టతలపై వెంట్రుకలు వస్తాయేమో అని ఆశపడి వెళ్లిన వారికి నిరాశే మిగలడంతో పాటు డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తామంటూ ప్రచారం చేయడంతో జనం ఎగబడ్డారు. చివరకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
బట్టతల మీద జుట్టు రప్పిస్తామంటూ ఉప్పల్లో ఇద్దరు వ్యక్తులు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనికి అనుమతులు లేవంటూ నిన్న (బుధవారం) పోలీసులు.. నిర్వాహకులు హరీష్ను అదుపులోకి తీసుకుని శిబిరానికి వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించారు. ఉప్పల్ భగయత్లోని శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ వద్దకు జనం ఎగబడ్డారు. ఫీజు రూ.300, షాంపో ఆయిల్కు రూ.700లు చొప్పున మొత్తం రూ.1000 వసూలు చేస్తున్నారు. బట్టతలపై వెంట్రుకలు వస్తాయో లేదో తెలియదు కానీ జనం మాత్రం భారీగా తరలివస్తున్నారు.
సూర్యాపేట జిల్లా రాజ్నాయక్ తండాకు చెందిన హరీష్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ నుంచి ఫ్రాంచైజీ తీసుకుని ఈ శిబిరం నిర్వహిస్తున్నాడు. బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామంటూ హరీష్ ఇన్స్ట్రాగ్రామ్లో ప్రచారం చేశాడు. ఇది వేగంగా ప్రజల్లోకి వెళ్లింది. బట్టతలపై వెంట్రకలు కచ్చితంగా మొలిపిస్తామంటూ నిర్వాహకుడు వాగ్దానం కూడా చేశాడు. దీంతో పెద్ద సంఖ్యలో బాధితులు శిబిరం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఒక్కొక్కరి వద్ద నుంచి దాదాపు వెయ్యి వరకు నిర్వాహకుడు వసూలు చేశాడు. బాధితులకు నున్నగా గుండు గీసి.. తలపై ఆయిల్ రాసి మూడు నెలల్లో వెంట్రుకలు వస్తాయని నమ్మించాడు. అయితే తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్టాల్ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో జరగడం ఇది రెండో సారి. కొద్దిరోజుల క్రితమే ఇలాంటి ఘటన జరిగింది. మళ్లీ సేమ్ రిపీట్ అవడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అలాగే ఇలాంటి వాటికి మోసపోవద్దంటూ బట్టతల ఉన్నవారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు
Honeymoon Couple: హనీమూన్కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Read Latest Telangana News And Telugu News