మంత్రి నారాయణ కుమార్తె శరణి రాసిన ‘మైండ్ సెట్ షిఫ్ట్ ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. గతంలో సీక్రెట్ అనే బుక్ నాకు ఎంతో నచ్చింది. ఇప్పుడు శరణి రాసిన పుస్తకం కూడా అందరకీ ఉపయోగకరంగా ఉంది. ఎంతోమంది కష్టం వచ్చిన వెంటనే కుంగి పోతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటే పాజిటివ్ అలోచన ఉండాలి.
నేను చదువుకునే వయసులో నాటకాలు వేస్తే అవార్డులు వచ్చాయి. అప్పుడే నేను సినిమాల్లో ఎందుకు రాణించకూడదు అనుకున్నా. నువ్వు హీరో ఏంటి?.. నటుడు ఏంటి?.. అని చాలా మంది హేళన కూడా చేశారు. మా తల్లిదండ్రులకు చెబితే నన్ను ప్రోత్సహించారు. ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నా. రాత్రి కాలేజ్లో చదువుకున్నా. చదువు వదిలి సినిమాలే నా జీవితం అనుకుని ధైర్యంగా ముందుకు వెళ్లా. ఆ తరువాత అందరి చేతా వావ్ అనిపించుకున్నా. నేడు ఇన్నికోట్ల మంది అభిమానం సంపాదించా. మన మైండ్ మనకు ఏది మంచిదో చెబుతుంది.
మీమాంస పడకుండా.. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. పాజిటీవ్గా ఆలోచన చేయాలి. చంద్రబాబు గారి మైండ్ సెట్ ఎప్పుడూ నాయకత్వ లక్షణాలతో ఉంటుంది. ఆయన ప్రజలకు, రాష్ట్రానికి ఏమి చేయాలనే ఆలోచనతో ఉంటారు. రాజకీయాల్లో చంద్రబాబు, సినిమాల్లో నేను రాణించామంటే పాజిటివ్ ఆలోచన, మైండ్సెట్ కారణం. చంద్రబాబు మహా నాయకుడిగా ఎదిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఇలాంటి నాయకుల మైండ్ సెట్ మనకు ఆదర్శం కావాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ‘మైండ్ సెట్ షిఫ్ట్ ’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న చంద్రబాబు
నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్