– Advertisement –
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు, కార్మిక వర్గ నేత కామ్రేడ్ దీపక్ సర్కార్ మృతికి సీఐటీయూ తీవ్ర సంతాపం తెలియచేసింది. ఆయనకు అరుణాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపింది.
పశ్చిమ బెంగాల్లోని మిడ్నపూర్లో తన నివాసంలో ఈ నెల 13న దీపక్ సర్కార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏండ్లు. 1940లో జన్మించిన ఆయన ప్రముఖ కమ్యూనిస్టు యోధులు సుకుమార్ సేన్గుప్తా నుంచి స్ఫూర్తి పొంది 1960ల్లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్గా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ప్రజలకు సేవలందించడం పట్ల ఆయనకు గల నిబద్ధత ఆయనను 1985లో పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తగా మార్చింది. 1970లో సీఐటీయూలో చేరిన కామ్రేడ్ సర్కార్ మిడ్నపూర్ జిల్లాలోని రోడ్డు, రవాణా కార్మికులందరినీ సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్య నేతగా ఎదిగిన ఆయన అవిభాజ్య మిడ్నపూర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత పశ్చిమ మిడ్నపూర్ జిల్లా అధ్యక్షుడిగా దశాబ్దాల పాటు పనిచేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ మాజీ సభ్యుడు కూడా అయిన సర్కార్ సీఐటీయూ అఖిల భారత వర్కింట్ కమిటీ సభ్యులు. రోడ్డు రవాణా కార్మికుల సంఘం నిర్మాణానికి విశేషమైన సేవలందించిన సర్కార్ ఎన్నటికీ కార్మికుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఐటీయూ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
సీపీఐ(ఎం) అగ్ర నేతల్లో ఒకరైన కామ్రేడ్ సర్కార్ అవిభాజ్య మిడ్నపూర్ జిల్లా కార్యదర్శిగా 1992 నుంచి పనిచేశారు. తర్వాత 2015 వరకు పశ్చిమ మిడ్నపూర్ జిల్లా కార్యదర్శిగా వున్నారు.
కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘ సిద్ధాంతాల పట్ల అచంచలమైన నిబద్ధతకు ఆయన రాజకీయ జీవితమే తార్కాణం. సంస్థాగత క్రమశిక్షణకు ఆయన ధృఢంగా కట్టుబడి వున్నారు. తద్వారా ఆయనను అందరూ అభిమానించేవారు. బెంగాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ కామ్రేడ్ సర్కార్ నాయకత్వం, ఆయన ప్రదర్శించిన పట్టువిడుపుల ధోరణి జంగల్ మహల్ ప్రాంతంలో తృణమూల్-మావోయిస్టులు చేపట్టిన హింస, బీభత్సాన్ని ప్రతిఘటించడానికి కీలకంగా ఉపయోగపడింది. ఆయన మృతితో సీఐటీయూకు, ప్రజాస్వామ్య ఉద్యమానికి తీరని నష్టమని సీఐటీయూ పేర్కొంది.
– Advertisement –