– Advertisement –
– సరిహద్దు ఘర్షణల్లో 40మందికి పైగా మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు 48గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని పాక్ విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. అంతకుముందు ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాల్లో తాజాగా చెలరేగిన ఘర్షణలు, అల్లర్లలో డజన్ల సంఖ్యలో పౌరులు, సైనికులు మరణించారు. 40మందికి పైగా ఆఫ్ఘన్ తాలిబన్ కార్యకర్తలను హతమార్చామని పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. తాలిబన్ల అభ్యర్ధన మేరకు పాక్ ప్రభుత్వం, ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ఇది బుధవారం సాయంత్రం ఆరు గంటల నుండి 48గంటల పాటు అమల్లో వుంటుందని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. కాగా దీనిపై కాబూల్లోని తాలిబన్ అధికారుల నుండి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు. ఆఫ్ఘన్తో గల సరిహద్దు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ తాలిబన్లు పలుసార్లు దాడులకు దిగారని, వాటిని తాము విజయవంతంగా తిప్పికొట్టామని పాక్ ఆర్మీ అంతకుముందు ప్రకటించింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే తాలిబన్లు ఈ దాడులకు దిగారని పేర్కొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో స్పిన్ బోల్డక్ ఏరియాలో నాలుగు చోట్ల ఆఫ్ఘన్ తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ఆ దాడులను తిప్పికొట్టే సమయంలో 15నుండి 20మంది తాలిబన్లను మట్టుబెట్టామని ఆర్మీ తెలిపింది. ఇంకా మరో రెండు మూడు ప్రాంతాల్లో కూడా ఇదే రీతిలో దాడులు జరుగుతున్నాయని తెలిపింది. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి)తీవ్రవాదులే ఈ దారుణాలకు తెగబడ్డారని పేర్కొంది. పాక్-ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్ గేటుకు ఆఫ్ఘన్ వైపు గల భాగాన్ని ఆఫ్ఘన్ తాలిబన్లు ధ్వంసం చేశారని, దీన్ని బట్టి వారి మనస్తత్వ ధోరణి అర్ధహవుతోందని ఆర్మీ ప్రకటన పేర్కొంది.
– Advertisement –