ఇదివరకూ మలబద్ధకం సమస్య ఎక్కువగా పెద్దవారిలోనే కనిపిస్తుండేది. ఇప్పుడు చిన్నవయసు నుంచే దాదాపు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో ఎదురవుతోంది. అయితే సిగ్గు కారణంగా దాని గురించి బహిరంగంగా మాట్లాడరు. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గడం, నీళ్లు సరిగా తాగకపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం, రాత్రి ఎక్కువసేపు మేల్కోవడం తదితర కారణాల వల్ల జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. కడుపు శుభ్రం కాకపోతే పేగు కదలికలలో ఇబ్బంది ఏర్పడి మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 22 శాతం మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా మొదలయ్యే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. చాలా కాలం పాటు కొనసాగితే అల్సర్లు, పైల్స్ వంటి ఇతర తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అందుకే తొలినాళ్లలోనే నివారణకు ప్రయత్నిస్తే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇంట్లోనే చేసుకున్న ఈ డ్రింక్ రోజూ తాగారంటే మలబద్దకం సమస్య ఇట్టే మాయమైపోతుంది.
మలబద్ధకం సమస్య ఏ వయసు వారికైనా సంభవించవచ్చు. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది మరింత జటిలంగా మారుతుందని వైద్యులు అంటున్నారు. అందుకే శరీరంలోని అన్ని వ్యవస్థలను దెబ్బతీయకముందే ముందునుంచే జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. మీరు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందాలనుకుంటే ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి.
ఎండుద్రాక్ష నీరు
మలబద్ధకం సమస్య తొలగించే ది బెస్ట్ హోం రెమెడీ ఎండుద్రాక్ష నీరు. మీరు ఇంట్లోనే దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
ఎండుద్రాక్ష నీరు ఇలా చేయండి..
1. ముందుగా నాలుగైదు ఎండు ద్రాక్షలను తీసుకోవాలి.
2. వాటిని ఒక గిన్నెలో తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి.
3. ఉదయం పూట మొదటగా ఈ నానబెట్టిన ఎండు ద్రాక్షలను తిని అందులోని నీటిని తాగాలి.
ఇది కాకుండా, మలబద్ధకాన్ని నివారించడానికి కొన్ని ఇతర చిట్కాలు పాటించవచ్చు. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం, పీచు పదార్థాలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం వంటివి చేయండి. ఉప్పు, నూనెల మోతాదులు తగ్గించడం కూడా ముఖ్యం.