అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ప్రతీదీ ప్రత్యేకమే. ఏ వేడుక చేసినా ఏ విందు, వినోదాలు చేసినా స్పెషల్గా నిలవడం ఇక్కడి వారి సొంతం. తాజాగా బోథ్ మండల కేంద్రంలోను అక్కడి స్థానికులు చేసిన కార్యం అంతే ప్రత్యేకంగా నిలిచింది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
అసలు అడవుల జిల్లా అందులోను వేసవి వచ్చిందంటే భూగర్బ జలాలు అడుగంటిపోయి దాహం.. దాహం.. అని గొంతెత్తే జిల్లా. అలాంటి ప్రాంతంలో 30 ఏళ్లుగా ఎలాంటి నీటి కష్టం రాకుంటే అంతకంటే అదృష్టం ఇంకేమైనా ఉంటుందా..! అదిగో అలాంటి అదృష్టాన్ని ప్రసాదించింది బోథ్ మండల కేంద్రంలోని ఓ బోరింగ్. అలా ఇలా కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ స్టిల్ కంటిన్యూ అన్నట్టుగా మండు వేసవిలోనూ ధారాళంగా జలదారతో దాహాన్ని తీర్చింది. అంతే అక్కడి స్థానికులు ఆ బోరింగ్ను తమ ఇంటి పెద్ద దిక్కుగా భావించి సత్కరించాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నదే తడువుగా ఇదిగో ఇలా బొట్టు పెట్టి ప్రత్యేక పూజలు చేసి పూల మాల, శాలువాలతో సన్మానించి బోరింగ్ రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మైసమ్మ కాలనీలో చోటు చేసుకుంది.
ఎంత కరువు పరిస్థితులు వచ్చినా.. ఎన్ని విధి వైపరీత్యాలు వెంటాడినా ఎప్పుడు కూడా అడుగంటాకుండా కాలనీ వాసుల దాహర్తిని తీర్చింది. ఇప్పటికి పెళ్లి వేడుకలకు, శుభకార్యాలకు మంచి నీళ్లను అందిస్తూ కాలనీ వాసుల మన్ననలను అందుకుంటోందని గుర్తు చేసుకున్నారు మైసమ్మ కాలనీ వాసులు. పట్టణంలో పదుల సంఖ్యలో బోరింగ్ లున్నా.. మైసమ్మ కాలనీలోని ఈ బోర్వెల్ మాత్రం తాగునీటి కష్టాలను తీరుస్తుందని, ఈ ఏడాది కూడా దాహర్చిని తీరుస్తుందన్న నమ్మకం ఉందంటున్నారు బోథ్ వాసులు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..