రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో రామరాజ్యం వీర రాఘవరెడ్డిపై దాడి జరిగింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో.. జైలుకు వెళ్లాడు వీర రాఘవ. బెయిల్పై బయటకు వచ్చిన ఆయన్ను రోజూ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది కోర్ట్. దీంతో.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వస్తుండగా వీర రాఘవ రెడ్డిపై 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో దాడి చేయడంతో.. చేతులు, ముఖంపై గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుండగుల దాడిలో గాయపడ్డ వీరరాఘవను హాస్పిటల్కు తరలించారు. చికిత్స తర్వాత.. మొయినాబాద్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు వీర రాఘవ రెడ్డి. తనకు రక్షణ కల్పించాలని కోరాడు.
ఇతర ధర్మాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి అంటూ రామరాజ్యం అనే సంస్థను స్థాపించాడు వీర రాఘవరెడ్డి. చట్టం, న్యాయవ్యవస్థ హిందూ ధర్మాన్ని రక్షించడం లేదంటూ సొంత సైన్యానికి తెరలేపాడు. ఆంధ్ర, తెలంగాణల్లోని దేవాలయాల పూజారుల వద్దకు వెళ్లి తన రామరాజ్యానికి ఆర్థిక మద్దతు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ తమకు సానుకూలంగా స్పందించడం లేదని ఆయనపై దాడి చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెను దుమారం చెలరేగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వీర రాఘవరెడ్డి కండీషన్ బెయిల్పై బయటకు వచ్చాడు.