- సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై మంత్రి ఉత్తమ్తో మంత్రి తుమ్మల భేటీ
- సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదన
- సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత, భవిష్యత్ ప్రణాళికలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, మిగిలిన పనుల పురోగతిని సమీక్షిస్తూ, ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష, పని వేగం తదితర అంశాలను విశ్లేషించారు.
సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలని, పంప్ హౌస్ 4 నిర్మాణాన్ని కూడా ఈ ఏడాదిలో పూర్తి చేయాలని మంత్రుల ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పని నాణ్యత, ఖర్చు నియంత్రణ, పనుల సమయపాలనపై అధికారులు, కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షించి, పనులను మరింత వేగవంతం చేయాలి. ప్రాజెక్ట్ పనుల్లో ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలన్నారు.
రాబోయే మూడు సంవత్సరాలలో బ్యారేజీ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ బ్యారేజీ ద్వారా 500 MW – 600 MW విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గోదావరి జలాలతో సస్య శ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో కీలకం కానుందనీ మంత్రి తుమ్మల స్పష్టం చేసారు.భవిష్యత్ లో కృష్ణా జలాలు ఇబ్బందిగా మారితే సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్ట్ జీవధార గా నిలుస్తుందని, జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు రిజర్వాయర్ కు గోదావరి నీళ్ళు చేరితే భవిష్యత్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీతారామ వర ప్రదాయనిగా మారుతుందని మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కు వివరించారు. ఇరువురు మంత్రులు దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం రైతాంగం మేలు కోసం సాగు నీటికి బాటలు వేసే పనులు పై కీలక విషయాలు చర్చించినట్లు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ తెలిపారు.