- భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
- ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు పర్యటన
- ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయాలపై చర్చ
- జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ ఓ తెలుగమ్మాయి

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీతో పాటు భారతదేశాన్ని సందర్శిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు రెండు దేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంస్కృతిక వేదికలలో జరిగే కార్యక్రమాలకు కూడా హాజరవుతారు.
READ MORE: TDP vs YSRCP: టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్.. గోశాలలో తేల్చుకుందాం రా..!
ఉషా వాన్స్ ఎవరు?
ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఆమె పూర్వికులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980ల్లోనే అమెరికా వలస వెళ్లారు. వీళ్ల ముగ్గురు సంతానంలో ఉష ఒకరు. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూనే, శాన్డియాగో విశ్వవిద్యాలయంలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ పదవిలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణ… క్రిష్ చిలుకూరిగా అందరికీ పరిచయం. ఆయన ఏరోస్పేస్ ఇంజినీర్. యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్గా పనిచేశారు. ఆపై కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్గానూ వ్యవహరించారు.