హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ‘దోస్త్ 2025’ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి శుక్రవార (మే 2) విడుదల చేశారు. మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాలు చేపట్టనున్నారు. మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 3 నుంచి 21 వరకు కొనసాగుతుంది. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఇక మే 29న మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతాయి. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఇక జూన్ 13న సెకండ్ ఫేస్ సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 13 నుంచి 19 వరకు ఉంటుంది. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. దీంతో మూడు ఫేస్లలో డిగ్రీ ప్రవేశాలు పూర్తవుతాయి. జూన్ 30 నుంచి కొత్త విద్యా సంవత్సరానికి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిగ్రీ కాలేజీల్లో బకెట్ సిస్టమ్, రిజర్వేషన్లతో ఈసారి ప్రవేశ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఏడాదికి మొత్తం 4,67,456 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మే నెలలో ఫెయిలైన వారికి సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఇక సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాక నెలాఖరు నుంచి సప్లిమెంటరీ విద్యార్ధులకు కూడా దోస్త్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇంటర్ మార్కులతో పాటు విద్యార్థులు ఎంచుకునే ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.