విషయం బయటకు పొక్కడంతో విడిచిపెట్టిన కిడ్నాపర్లు
కిడ్నాప్ ముఠాలో రాజేష్ స్నేహితునితో పాటు మరో ఆరుగురు
నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి పోలీసులు
తిరుపతి(నేరవిభాగం), మార్చి 30(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో రాజేష్ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. ఆర్థిక లావాదేవీల కారణంతో ఒకే కుటుంబంలోని ఐదుగురిని కిడ్నాప్ చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న విషయం విదితమే. రూ.2 కోట్లు ఇస్తేనే విడిచి పెడతామని కిడ్నాపర్లు బెదిరించిన నేపథ్యంలో పోలీసులు గాలింపు చేట్టారు. కిడ్నాప్ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం.. కారులో నుంచి రాజేష్ దూకి తప్పించుకోవడం, పోలీసులకు తెలిసి పోవడంతో కిడ్నాపర్లు ఆందోళనకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి రాజేష్ తల్లి విజయను చిత్తూరు-బెంగుళూరు మార్గమధ్యలో రోడ్డుపై వదిలి వెళ్లారు. ఆమె ఇతరుల సాయంతో ఆదివారం తెల్లవారుజామున జీవకోనలోని కుమారుడి ఇంటికి చేరుకున్నారు. రాజేష్ భార్య సుమతి, ఇద్దరు పిల్లలను బెంగళూరులోని సుమతి అమ్మ ఇంటికి దూరంగా కిడ్నాపర్లు వదిలిపెట్టారు. రాజేష్ తల్లి నుంచి ఆదివారం ఉదయం పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు.
కిడ్నాప్ ఎందుకంటే?
రాజేష్, భార్గవ్ స్నేహితులు. రాజేష్ వద్ద భార్గవ్ రూ.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు ఇవ్వకపోగా.. మళ్లీ రూ.2 కోట్లు ఇవ్వాలని తన స్నేహితుడు అరుణ్తో కలిసి డిమాండ్ చేశాడు. దీనికి రాజేష్ నిరాకరించడంతో అరుణ్తో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి అక్కారాంపల్లిలోని ఒక అపార్టుమెంటు వద్దకు రావాలని రాజే్షకు ఫోను చేసి పిలిచారు. అనుమానించిన రాజేష్ తనతో పాటు తల్లి, భార్య, పిల్లలను తీసుకొచ్చారు. పథకం ప్రకారం భార్గవ్, అరుణ్ వీరితో గొడవ పడ్డారు. రాజే్షను ఒక కారులో, కుటుంబ సభ్యులను మరో కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మరో ఐదుగురు ఈ కిడ్నాప్లో పాల్గొన్నట్టు తెలిసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా రెండు కార్లను అలిపిరి పోలీసులు గుర్తించారు. ఆ కార్లు ఎవరివి? డ్రైవర్లుగా ఎవరు వెళ్లారు? ఇప్పుడు వాళ్లెక్కడ ఉన్నారనేది వారి ఫోన్ల ఆధారంగా గుర్తించేందుకు టెక్నికల్ టీమ్లు రంగంలోకి దిగాయి. కిడ్నాపర్లు బెంగళూరులోనే ఉంటారని భావించిన పోలీసులు రెండు బృందాలను పంపారు. ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి…
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News