- ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఫిలిం నగర్ పోలీసులు
- జనవరి 10న పొన్నాల ఇంట్లో ఆభరణాలు, నగదు చోరీ
- యూపీకి చెందిన రాజ్ కుమార్ పాండా, మరో ఇద్దరు అరెస్ట్
- మరో నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న పోలీసులు

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ పాండాతో పాటు మరో ఇద్దరి అరెస్ట్ చేయగా.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో గత జనవరిలో చోరీ జరిగింది. ఫిల్మ్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.92లో పొన్నాల లక్ష్మయ్య తన సతీమణి అరుణాదేవి నివాసం ఉంటున్నారు. జనవరి 10న సమీపంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి వెళ్లి వచ్చారు. మరుసటి రోజు ఉదయం బెడ్రూమ్ తలుపులు, కబోర్డు తెరిచి ఉన్నట్లు గుర్తించారు. అల్మారాలో భద్రపరిచిన రూ.10లక్షల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు కన్పించకపోవడంతో అరుణాదేవి ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అల్మారాలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలున్నా వాటి జోలికి వెళ్లకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇంట్లోని పనివారు లేదా తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు.
READ MORE: Godavari Delta: 3 ప్రధాన కాలువలకు సాగునీటి సరఫరా నిలిపివేత.. మళ్లీ జూన్ ఒకటి నుంచి నీరు విడుదల!
చోరీ తర్వాత సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఘటనాస్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడం, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ చీకటి వల్ల సరిగ్గా కనిపించలేదు. నిందితులను గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం 87లో నివాసం ఉంటున్న వ్యాపారి సురేందర్రెడ్డి ఇంట్లో చోరీ కోసం వచ్చిన ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతానికి చెందిన డ్రైవర్ రాజ్కుమార్పాండే అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పదేళ్లుగా నగరంలోనే ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్న రాజ్కుమార్ పాండేను అదుపులోకి తీసుకుని విచారించిన ఫిలింనగర్ పోలీసులు అతడి వేలిముద్రలు సేకరించారు. వాటిని ఫింగర్ప్రింట్ బ్యూరోలో నమోదు చేశారు. కాగా పొన్నాల లక్ష్యయ్య ఇంట్లో చోరీ సందర్భంగా లభ్యమైన వేలిముద్రలతో పాండే వేలిముద్రలు సరిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.