హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గ్రూప్ 1 ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది మొదల్లు పరీక్షలు, ఫలితాలు, మూల్యాంకనం, ర్యాంకులు.. ఇలా ప్రతిదీ వివాదాస్పదంగా మారాయి. టీజీపీఎస్సీ ఫైనల్ ఫలితాల్లో తెలుగు మీడియంకి చెందిన అభ్యర్ధులు ఒక్కరూ ఎంపిక అవకపోవడం ఈ వివాదాలకు ఊతమిచ్చినట్లైంది. దీంతో పలువురు అభ్యర్ధులు ఈ వ్యవహారంపై హైకోర్టు ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం బుధవారం (ఏప్రిల్ 30) విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. వరుస హాల్టికెట్ల వారికి ఒకే విధమైన మార్కులు వచ్చాయని, నిర్దేశించిన సమయానికి ప్రొవిజనల్ మార్కుల జాబితా ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. పైగా కొన్ని పరీక్ష కేంద్రాల్లోని వారే అధికంగా ఎంపికైనట్లు వెల్లడించారు.
ఆ తర్వాత 20 రోజులకి తుది మార్కులు టీజీపీఎస్సీ వెల్లడించిందనీ.. ఆ 20 రోజుల్లో అవకతవకలు జరిగాయనే అనుమానంగా ఉందని అన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం మూల్యాంకన ప్రక్రియ గురించి టీజీపీఎస్సీని ప్రశ్నించింది. తెలుగులో రాసిన అభ్యర్థులకు ఎలా మార్కులు వేశారని ప్రశ్నించింది. దీనితోపాటు తెలుగులో రాస్తే తక్కువ మార్కులేశారని ఆరోపణలు వస్తున్నాయి. జవాబులకు సంబంధించి ఏదైనా కీ పేపర్ ఏదైనా ఉంటుందా? తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల కీ ఇచ్చారా? అంటూ టీజీపీఎస్సీకి వరుస ప్రశ్నలు సంధించింది. దీనిపై కమిషన్ స్పందిస్తూ.. ఎవాల్యుయేటర్లకు ఎలాంటి కీ ఇవ్వలేదని తెలిపింది. డిస్ర్కిప్టిప్ పరీక్ష కావడంతో కీ ఇవ్వడం కుదరదని, జవాబు పత్రాలు దిద్దిన వారు ఆయా సబ్జెక్టుల్లో నిపుణులని కోర్టుకు టీజీపీఎస్సీ సమాధానం ఇచ్చింది.
కమిషన్ సమాధానాలు విన్న కోర్టు.. తెలుగులో ఎంతమంది రాశారో? ఎంత మంది ఎంపికయ్యా? వంటి వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీని కోర్టు ఆదేశించింది. ఈ పరీక్షతోపాటు గత గ్రూప్ 1 అభ్యర్థుల వివరాలుసైతం ఇస్తామని కోర్టుకు టీజీపీఎస్సీ తెలిపింది. ఏళ్లుగా నిరుద్యోగులు గ్రూప్ 1 కోసం ఎదురుచూస్తున్నారని, ఆలస్యం లేకుండా విచారణ ముగించాల్సి ఉందని అభిప్రాయపడిన హైకోర్టు.. తదుపరి విచారణ ఈ రోజు చేపట్టనుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.