SSC Exams in AP 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు పరీక్షల నిర్వహణ కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో ఉన్న మోడల్ స్కూల్లో పదో తరగతి పరీక్షల కోసం రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. సెంటర్ ఏలో 207 మంది, బీలో 218 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలతో నాలుగు స్క్వాడ్ టీమ్లు ఈ రెండు సెంటర్లలో తనిఖీలు చేశాయి. అక్కడ విద్యార్థులు ఆంగ్ల పరీక్షను చూసి రాస్తున్నట్లు గుర్తించారు. వీరికి సహకరించిన 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. అలాగే ఏ కేంద్రంలో ముగ్గురు.. బీ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశారు.
కుప్పిలిలోని జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు దగ్గరుండి స్లిప్పులు తయారు చేసి ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ స్వ్కాడ్ ఉన్నాసరే పక్కా ప్లాన్తో చూచిరాతకు సహకరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు షాకయ్యారు. వీరు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించేలా చేసే క్రమంలో ఇలా చేసినట్లు సమాచారం. మొత్తానికి పదో తరగతి పరీక్షల్లో ఈ చూచిరాత వ్యవహారం కలకలం రేపుతోంది.
అధికారులు అలర్ట్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. సాధారణంగా ట్రిపుల్ ఐటీల్లో 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారనే విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఈ చూచిరాత మార్గాన్ని ఎన్నుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక శుక్రవారం (మార్చి 21) జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,20,173 మంది హాజరు కావాల్సి ఉండగా.. 6,13,487 మంది హాజరయ్యారు.