అమరావతి, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాల్లో కొనసాగుతున్న ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నేటితో (ఏప్రిల్ 9వ తేదీ) మూల్యాంకనం ప్రక్రియ ముగియనుంది. మరోవైపు ఏప్రిల్ 3 నుంచి 7 వరకు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లతో ఈ ప్రక్రియ మొత్తం ఏడు రోజుల పాటు కొనసాగింది. ఎక్కడా ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్భందీగా అన్ని చోట్ల పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు.
మూల్యాంకనం చేసిన పత్రాల పునఃపరిశీలన చేసి మార్కుల తేడాలు లేకుండా పకడ్భందీగా పూర్తి చేశారు. ఇక మార్కుల ఎంటర్ ప్రక్రియతోపాటు ఇతర పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ నెల చివరి నాటికి వెలువరించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు టెన్త్ ఫలితాలకు ముందే ఇంటర్ ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. విద్యార్ధులు ఫలితాలను ఆయా అధికారిక వెబ్సైట్లతోపాటు ‘మిత్రా’ యాప్లో కూడా నేరుగా చెక్ చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రారంభమవగా మరో వారం పాటు ఇది కొనసాగుతుంది. చకచకా మూల్యాంకనం పూర్తి చేసి నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.