కాంగ్రెస్ అధిష్ఠానానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల వినతి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గరపడుతున్నందున ఎవరికి స్థానం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కతాటిపైకి వచ్చారు. ఇప్పటి వరకు ఒక్కరికీ ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానంలేనందున ఈసారి మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు కొండంత ఆశపెట్టుకుని ఎవరికి వారే తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సానుకూల సంకేతాలు లేకపోవడంతో అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. తమలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), ప్రసాద్కుమార్ (వికారాబాద్), టి.రామ్మోహన్రెడ్డి (పరిగి), మనోహర్రెడ్డి (తాండూరు) గెలిచారు. ప్రసాద్కుమార్కు స్పీకర్ స్థానం దక్కింది. కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమలో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతూ పార్టీ అధిష్ఠానానికి ఇచ్చేందుకు లేఖ సిద్ధం చేశారు. హైదరాబాద్ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం లేకపోవడాన్ని ప్రస్తావించారు. ఈ లేఖపై స్పీకర్ ప్రసాద్కుమార్ సంతకం చేసినట్లు ఒక ఎమ్మెల్యే తెలిపారు. ఈ లేఖతో ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీ వెళ్లి రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలవనున్నట్లు ఎమ్మెల్యేలు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేత జానారెడ్డిని కలిసి మద్దతు కోరారు. వీరిలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కూడా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి…
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News
Updated Date – Mar 31 , 2025 | 05:56 AM