ప్యాకర్స్ మూవర్స్ పేరుతో ఇంటి సామాన్లు తీసుకపోతున్నట్టు నమ్మించి అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ముఠాను షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బోయిన్పల్లికి చెందిన ప్రదీప్ కుమార్ తన బొలేరో వాహనాన్ని ప్యాకర్స్ మూవర్స్ పని కోసం ఉపయోగిస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన సన్నీ, మనీష్ కుమార్ పరిచయమయ్యారు. దీంతో బొలెరో వాహనానికి డ్రైవర్గా సన్నీ, హెల్పర్గా మనీష్ కుమార్ పని చేస్తూ ఉండేవారు. గత నెల మార్చి 31న ప్రదీప్ కుమార్ హర్యానా రాష్ట్రానికి చెందిన సాహిల్తో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడ సుభాష్ కలిసి 273 కిలోల గంజాయి కోసం లక్ష 30 వేల రూపాయలు చెల్లించి గంజాయి కొనుగోలు చేశారు.
ఒడిశా నుండి హర్యానాకు తెలంగాణ రాష్ట్రం మీదుగా.. హర్యానా, పంజాబ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్నారని పక్కా సమాచారంతో శనివారం షామీర్పేట్ ఓఆర్ఆర్ వద్ద ఎస్ఓటి, షామీర్పేట్ పోలీసులు సైబరాబాద్ బృందం సంయుక్తంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయి పట్టుకొని ముగ్గురిని షామీర్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 273 కిలోల గంజాయి, బొలెరో వాహనం, మొబైల్ ఫోనులు, జియో డంగిల్ స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి చెప్పారు. వీటి విలువ మొత్తం దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు గంజాయక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 9490617444 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డిసిపి కోరారు.