జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో ఓ కొండ ముచ్చు హల్చల్ చేసింది తొర్రూరు గ్రామానికి చెందిన నూకల నవీన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి రామవరం మీదుగా హైద్రాబాద్ వెళ్తున్నాడు. దారిలో రామవరం గ్రామంలోని ఓ కిరణం షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ కొనుక్కొని కారు దగ్గరకి వచ్చేసరికి కారుపై ఓ కొండముచ్చు కూర్చుని కనిపించింది. కారు సైడ్ మిర్రర్పైన కూర్చుని ఉన్న కొండముచ్చును చూసి ఒకింత భయపడ్డాడు ఎక్కడ తనపై దాడిచేస్తుందోనని. కారులో ఇంకా స్నేహితులు కూర్చుని ఉన్నారు. కారు స్టార్టింగ్లోనే ఉంది. అయినా కొండముచ్చు భయపడలేదు. మిర్రర్పైన కూర్చుని కదల్లేదు. మిత్రులంతా కలిసి దానిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా .. నేను మీతో వస్తాను అన్నట్టుగా మిర్రర్పైనే కూర్చుని ఉంది. బిస్కెట్స్, చిప్స్, వాటర్ ఇచ్చినా అవేమీ నాకొద్దు మీతో పాటు నేనూ రైడ్కి వస్తాను అన్నట్టుగా మొండికేసి కూర్చుంది.
చేసేది లేక ఫ్రెండ్స్ అంతా కారు స్టార్ట్ చేసి బయలుదేరారు. అలా కారు మిర్రర్పై కూర్చుని 10 కిలోమీటర్లు ప్రయాణించిన కొండముచ్చు రైడ్ని బాగా ఎంజాయ్ చేసింది. కారుపై జాలీగా ట్రావెల్ చేస్తూ స్థానికులను ఆకట్టుకుంది కొండముచ్చు. అలా కారుపై ప్రయాణిస్తూ మొండ్రాయి గ్రామ సమీపంలోని ఓ చెట్టుకింద కారు ఆపాడు నవీన్. దీంతో కాసేపటికి ఆ కొండముచ్చు థాంక్స్.. ఇక మీరు వెళ్లండి.. మా ఊరు వచ్చేసింది.. బై.. అన్నట్టుగా కారు దిగి వెళ్లిపోయింది కొండముచ్చు. ఇదంతా వీడియో తీసి నవీన్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.