Sunita Williams: సునీతా, బుచ్‌ భూమిపై ఎప్పుడు, ఎక్కడ ల్యాండ్‌ అవుతారో తెలుసా..? నాసా ఫుల్ షెడ్యూల్ ఇదే

Written by RAJU

Published on:

అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌‎ను భూమి పైకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు నాసా-స్పేస్‌ ఎక్స్‌లు సంయుక్తంగా క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌-9 రాకెట్‌.. మార్చి 15 శనివారం కెనడీ స్పేస్‌సెంటర్‌ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కూడా అనుసంధానం కాగా.. వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి సునీత, బుచ్ విల్మోర్ బృందం స్వాగతం పలికింది.. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్‌ షెడ్యూల్‌ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. అయితే.. మార్చి 19న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయల్దేరనున్నట్లు ముందు పేర్కొనగా.. ఆ షెడ్యూల్ ను నాసా ఒక రోజు ముందుకు మార్చింది. దీంతో 18న సునీతా విలియమ్స్, విల్మోర్ భూమిపైకి రానున్నారు.

క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక తిరుగు పయనం షెడ్యూల్ ఇదే..

క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10.45 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది..

సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక అన్‌డాకింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ స్పేస్‌షిప్‌ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది.

సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యలను దాటుకుని కిందకు చేరుకుంటుంది.

సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా బయటకు తీసుకురానున్నారు.

ఎన్నో జాగ్రత్తలు..

ఇక భూమి పైకి సునీత తదితరులను క్షేమంగా తీసుకురావడానికి నాసా బోలెడు జాగ్రత్తలు తీసుకుంది. రిటర్న్‌ జర్నీలో భాగంగా మొదట ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి క్రూ డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ విడిపోతుంది. ఆ తర్వాత స్పేస్ స్టేషన్‌ ఫొటోలు తీస్తుంది డ్రాగన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌. 41 నిమిషాల తర్వాత భూమి వైపు డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ పయనం ప్రారంభిస్తుంది. అదే సమయంలో సోలార్‌ ప్యానెళ్ల ద్వారా డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ బ్యాటరీలు చార్జింగ్‌ అవుతాయి. ఇక భూమిపై ల్యాండింగ్‌కి 44 నిమిషాల ముందు థ్రస్టర్‌ ఆన్‌ చేస్తారు. దీనివల్ల డ్రాగన్‌ క్యాప్సూల్‌ భూమి పైకి వచ్చేటప్పుడు, దాని వేగం తగ్గుతుంది. ఇక ల్యాండింగ్‌కు 3 నిమిషాల ముందు 3 ప్యారాచూట్లు తెరుచుకుంటాయి. ఈ ప్యారాచూట్ల ద్వారా స్పేస్‌క్రాఫ్ట్‌ వేగాన్ని నియంత్రిస్తారు. ఇక డ్రాగన్‌ క్యాప్సూల్‌ని అట్లాంటిక్‌ మహా సముద్రంలో ల్యాండ్‌ చేస్తారు. ఆ తర్వాత రికవరీ టీమ్‌, దాన్ని తీరానికి తీసుకొస్తుంది. ఇక ల్యాండింగ్‌ సైట్‌ దగ్గర నాసా-స్పేస్‌ ఎక్స్‌ టీమ్‌ సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరిని క్షేమంగా బయటకు తీసుకురానున్నారు.

2024, జూన్‌ 5న ISSకు సునీత.. అంతరిక్షంలోనే 283 రోజులు

కాగా.. 2024 జూన్‌‎లో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్, నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌.. మిషన్ క్రూ-9 ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. వాళ్లు వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌‎లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ తిరిగి భూమిపైకి రాగా.. సునీత, బుచ్‌ విల్మోర్‌లు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఇక సునీతా విలియమ్స్‌ను తీసుకురావడానికి లేటెస్టుగా వెళ్లిన డ్రాగన్‌ క్యాప్సూల్‌లో అన్నె మెక్లెయిన్‌, నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌ ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification