ABN
, Publish Date – Mar 22 , 2025 | 04:57 AM
ఎస్ఎల్బీసీ సొరంగంలో ఊట నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీని వల్ల సహాయక చర్యల్లో అవాంతరాలు ఉత్పన్నమవుతాయి. దీంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కనుగొనడం మరింత కష్టంగా మారింది.

-
డీ వాటరింగ్ కోసం కొత్త మోటార్లు
-
ఐదు షిఫ్ట్లుల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
నాగర్కర్నూల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఎస్ఎల్బీసీ సొరంగంలో ఊట నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీని వల్ల సహాయక చర్యల్లో అవాంతరాలు ఉత్పన్నమవుతాయి. దీంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కనుగొనడం మరింత కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎ్ఫలకు చెందిన ముఖ్యులు శుక్రవారం సమావేశమై సొరంగం లోపల జరుగుతున్న సహాయక చర్యల గురించి, ఇంకా తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాల గురించి చర్చించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తి కాకపోవడానికి ప్రధానమైన కారణాలను విశ్లేషించారు. ప్లాస్మా కట్టర్లు, ర్యాట్హోల్ మైనర్స్తో పాటు సింగరేణి కార్మికులు నిరంతరం శ్రమించి టీబీఎం శకలాలను, మట్టిని బయటకు పంపించే ప్రయత్నాలను ముమ్మరం చేసిన క్రమంలో ఊట నీరు అధికంగా రావడం ప్రధానమైన సమస్యగా మారింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే సొరంగంలో డీవాటరింగ్ కోసం నాలుగు స్టేషన్లు పని చేస్తుండగా అదనంగా కొత్త మోటార్లను బిగించే ప్రక్రియ ప్రారంభమైంది. సహాయక చర్యల్లో పాల్గొనే వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయడానికి మూడు నుంచి ఐదు షిఫ్టులకు పెంచారు. సొరంగంలో 8 మంది చిక్కుకుపోగా.. ఇప్పటివరకు ఒకరి మృతదేహం లభ్యమైంది. ఇంకా ఏడుగురి ఆచూకీ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ సొరంగం లోపల వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది.
Updated Date – Mar 22 , 2025 | 04:57 AM