భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ సైనిక్ బోర్డ్ సెక్రటేరియట్-‘ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీం’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని మాజీ సైనికులు/మాజీ కోస్ట్ గార్డ్ సిబ్బంది పిల్లలకు, వితంతువులకు ఉద్దేశించారు. వీరు ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ డిగ్రీ కోర్సులు చేసేందుకు ప్రోత్సహిస్తూ ఈ పథకం కింద ఆర్థిక సహకారం అందిస్తారు. దేశం మొత్తమ్మీద 5500 మందికి అవకాశం కల్పిస్తారు. బాలురకు, బాలికలకు సమానంగా 2750 స్కాలర్షి్పలు కేటాయించారు. అభ్యర్థులు ఎంచుకొన్న కోర్సు ప్రకారం ఏడాది నుంచి అయిదేళ్ల వరకు స్కాలర్షిప్ ఇస్తారు. నెలకు రూ.2,500 చొప్పున బాలురకు ఏడాదికి రూ.30,000; నెలకు రూ. 3,000 చొప్పున బాలికలకు ఏడాదికి రూ.36,000 చెల్లిస్తారు. అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక మాజీ సైనిక/కోస్ట్ గార్డ్ ఉద్యోగికి సంబంధించి ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. అబ్బాయిలకు 25 ఏళ్లు వచ్చేవరకు, అమ్మాయిలకు వివాహమయ్యేవరకు స్కాలర్షిప్ అందిస్తారు. వితంతువులకు వారు మరల వివాహం చేసుకొనేవరకూ ఎటువంటి వయోపరిమితి నిబంధనలు లేవు.
అర్హత: కనీసం ఇంటర్/తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. ఇంటర్/ డిప్లొమా/డిగ్రీ స్థాయిలో ప్రథమ శ్రేణి మార్కులు ఉండాలి. బీఈ, బీటెక్, బీడీఎస్, ఎంబీబీఎస్, బీఈడీ, బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సర ప్రవేశం పొంది ఉండాలి. ఏఐసీటీఈ/మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో చేరి ఉండాలి. బీఏ+ఎల్ఎల్బీ, బీఎస్సీ+బీఈడీ వంటి ఇంటిగ్రేటెడ్(డ్యూయెల్) డిగ్రీ కోర్సుల్లో ప్రొఫెషనల్ స్టడీకి; బీఈ + ఎంఈ, బీబీఏ+ఎంబీఏ వంటి పూర్తి టెక్నికల్/ప్రొఫెషనల్ కోర్సుల్లో మొదటి డిగ్రీకి మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందినవారు, పారా మిలిటరీ ఉద్యోగుల పిల్లలు దరఖాస్తుకు అనర్హులు. ఈ స్కాలర్షిప్ లభించే కోర్సుల లిస్ట్ను వెబ్సైట్లో చూడవచ్చు.
ముఖ్య సమాచారం
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
వెబ్సైట్: https://ksb.gov.in