Rohini Khadse: మహిళలు ఒక హత్య చేస్తే శిక్ష ఉండకూడదు! రాష్ట్రపతికి ఎన్సీపీ(ఎస్పీ) మహిళా నేత సంచలన లేఖ

Written by RAJU

Published on:

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే ఒక సంచలన లేఖ రాశారు. మహిళలు ఒక హత్య చేయాలని అనుకుంటున్నారని, అలా హత్య చేసిన మహిళలకు శిక్ష పడకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. అయితే ఆమె హత్య చేస్తానని చెప్పింది మనిషి కాదు. మనిషిలో ఉన్న చెడు ఆలోచనలని. అణచివేత మనస్తత్వం, అత్యాచారం చేయాలనే ఆలోచనను, అస్తవ్యస్తంగా ఉన్న శాంతిభద్రతాలను మహిళలు హత్య చేయాలనుకుంటున్నారని, వారికి శిక్ష పడకుండా చూడాలంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇటీవలె ముంబైలో ఓ 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రోహిణి ఈ లేఖ రాశారు.

మహారాష్ట్రలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా మారాయని, మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆమె విమర్శించారు. మహిళలపై దాడులు చేయాలి, వారిని అణచిపెట్టి ఉంచాలి, వారిపై అత్యాచారం చేయాలనే మనస్తత్వాలను హత్య చేసేందుకు మహిళలకు అవకాశం ఇస్తూ వారికి శిక్ష నుంచి ఇమ్యూనిటీ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కిడ్నాప్‌, గృహ హింస వంటి నేరాలపై ఆమె గళం విప్పారు. అలాగే మన దేశం మహిళల భద్రతా విషయంలో సురక్షితం కాదని పలు నివేదికలు వెల్లడిస్తున్నట్లు కూడా ఆమె ఉటంకించారు.

“అణచివేత మనస్తత్వాన్ని, అత్యాచార ధోరణిని, శాంతిభద్రతల అసమర్థతను మేము చంపాలనుకుంటున్నాం… ఈ అంశంపై లోతుగా ఆలోచించిన తర్వాత మా డిమాండ్‌కు అంగీకరిస్తారని మేం ఆశిస్తున్నాం” అని రోహిణి ఖడ్సే అన్నారు. అయితే ఈ లేఖపై శివసేన మంత్రి గులాబ్‌రావ్ పాటిల్ స్పందిస్తూ, ఖడ్సే ఎవరిని హత్య చేస్తారో చెప్పాలని అన్నారు. ఎన్సీపీ(ఎస్పీ) నేత, ఎమ్మెల్సీ మనీషా కయాండే మాత్రం రోహిణి ఖడ్సేకు మద్దతు తెలిపారు. కొంతమంది వ్యక్తులలో కొన్ని ధోరణులను చంపడం గురించి ఖడ్సే మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కయాండే అన్నారు. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఆమెలో ఈ భావన కలిగించి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification