బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. పోలీసు విచారణలో భాగంగా బంగారు స్మగ్లింగ్ రాకెట్లో తన ప్రమేయాన్ని ఆమె ఖండించారు. అయితే తనను కావాలనే ఇరికించారని వాపోయారు. నివేదిక ప్రకారం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) విచారణ సందర్భంగా రన్యా విలపిస్తూ, తాను నిర్దోషినని పేర్కొంది. తాను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నానని, ఇందులో ఎందుకు జోక్యం చేసుకున్నానో అని ఆలోచిస్తున్నానని రన్యా తన న్యాయవాదులతో చెప్పింది. శుక్రవారం 2025 మార్చి 7న కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆమె తన న్యాయవాదులతో, “నేను దీనిలోకి ఎందుకు వచ్చానో అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. విమానాశ్రయంలో గడిపిన రోజు గుర్తుకు వస్తే నా మనసు చలించి పోతోంది.. నాకు నిద్ర పట్టడం లేదు. నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను.” అంటూ బోరున విలపించింది.
అయితే, రన్యారావును ఈ స్మగ్లింగ్ కుంభకోణంలోకి ఎవరు ఇరికించారు. ఎలాంటి పరిస్థితులు ఆమెను ఇందులో పాల్గొనడానికి దారితీశాయో వెల్లడించాలని అధికారులు కోరుతున్నారు. ఈ కేసు గత సంవత్సరం చెన్నైలో జరిగిన సంఘటనను పోలి ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. కేరళకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుండి 12 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడింది.
తరువాత దర్యాప్తులో బంగారం అక్రమ రవాణాలో పాల్గొన్న ఒక స్నేహితుడు అతన్ని బ్లాక్ మెయిల్ చేశాడని తేలింది. రన్యా రావుకు దగ్గరగా ఉన్న ఎవరైనా ఆమెను ఇలా చేయమని ఒత్తిడి చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో దుబాయ్ పర్యటన నుండి తిరిగి వస్తుండగా 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తుండగా రన్యారావును పోలీసులు అరెస్టు చేశారు. రన్యా రావు ఒక సిండికేట్లో భాగమని దర్యాప్తులో తేలింది. బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు రన్యా రావు (33) ను మూడు రోజుల పాటు DRI కస్టడీకి పంపింది. విచారణలో రన్యారావు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మరింత లోతైన దర్యాప్తు కొనసాగించనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..