గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసులో తనను ఇరికించారని, కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని నటి రన్యా రావు ఆరోపించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అదనపు డైరెక్టర్ జనరల్ (ADG)కి రాసిన లేఖలో అధికారికంగా చెప్పినట్లుగా తనను విమానాశ్రయ టెర్మినల్ నుండి కాకుండా నేరుగా విమానం నుండే అరెస్టు చేశారని రన్యా రావు ఆరోపించారు. అలాగే కస్టడీ సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని, నిద్రపోనివ్వడం లేదు, అన్నం కూడా తిననివ్వడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అలాగే తనతో బలవంతంగా వైట్ పేపర్లపై సంతకాలు చేయించారని కూడా పేర్కొన్నారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆమె బెయిల్ పిటీషన్ను కొట్టేసిన తర్వాత రోజు ఆమె ఈ ఆరోపణలు చేశారు. అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ వెనుక రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఈ కేసు తీవ్ర వివాదాస్పదమైంది. కర్ణాటక అసెంబ్లీలో కూడా ఈ కేసు విషయమై తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష బీజేపీ, అధికార పక్ష కాంగ్రెస్ మధ్య ఈ కేసు విషయంతో రచ్చ రచ్చ జరిగింది.
బంగారం అక్రమ రవాణాలో రన్యా రావు సవతి తండ్రి, కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కే రామచంద్రరావు ప్రమేయం ఉందనే ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి 14 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రన్యా రావును మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో DRI అధికారులు అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.