
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీటీ వారెంట్పై కర్నూలు జిల్లా జైలు నుంచి పోసానిని విజయవాడలోని భవానీపురం పోలీస్స్టేషన్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపర్చారు. ఆరోగ్యం సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు పోసాని కృష్ణమురళి. తనకు రెండు సార్లు హార్ట్ సర్జరీలు జరిగాయని.. కేసుల పేరుతో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారన్నారు పోసాని. ఏ కేసులో తీసుకెళ్తున్నారో కూడా చెప్పడం లేదన్నారు. నడవలేని స్థితిలో ఉన్నానని కోర్టుకు తెలిపారు పోసాని. పోసాని స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన న్యాయమూర్తి.. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. దీంతో కర్నూలు జిల్లా జైలుకు పోసానిని తరలించారు.
పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 3 నెలల క్రితం జనసేన నేత ఫిర్యాదుతో విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పీటీ వారెంట్పై పోసాని కృష్ణమురళిని విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరారు. ఇప్పటి వరకు పోసానిపై మొత్తం 16 కేసులు నమోదవ్వగా.. ఐదు కేసుల్లో రిలీఫ్ లభించింది. పాలకొండ, భవానీపురం, పాడేరు, విశాఖ, పట్టాభిపురంలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోసాని. బాపట్ల, నర్సీపట్నం పీఎస్లో నమోదైన కేసుల్లో పోలీసులు ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.