-
రాజధాని పనుల పునరుద్ధరణకు శ్రీకారం
-
వెలగపూడిలో భారీ బహిరంగ సభ
-
పనులన్నీ మూడేళ్లలో పూర్తిచేసి తీరాలి
-
వైసీపీది కుటిల రాజకీయం.. కుల మతాలు, ప్రాంతాల నడుమ చిచ్చుకు కుట్ర
-
వక్ఫ్ బిల్లుపై ఆ పార్టీది సెల్ఫ్గోల్
-
మన సంస్కరణలకు మైలేజీ రావడం లేదు
-
పీ4లో మంత్రులూ భాగస్వాములు కావాలి
-
కేబినెట్లో ముఖ్యమంత్రి పిలుపు
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణ కార్యక్రమానికి మే 2న ప్రధాని మోదీ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ పమావేశంలో ప్రధాని పర్యటన వివరాలను మంత్రివర్గ సహచరులకు ఆయన తెలియజేశారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో ఉగాది రోజున పీ4 కార్యక్రమం జరిపిన ప్రదేశంలోనే ప్రధానమంత్రి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెప్పారు. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులను కోరారు. గత ఐదేళ్లలో అమరావతిలో వైసీపీ పాలకులు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ‘సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లను ఆమోదించాం. మూడేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వీటి నిర్మాణం పూర్తి చేయాలి. మంత్రుల చాంబర్లు, సంబంధిత హెచ్వోడీ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా చూడాలి. అంతర్గత వసతులు ఎలా ఉండాలన్న అంశంపై స్పీకర్తోపాటు మంత్రులు పి.నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, లోకేశ్ సభ్యులుగా ఓ కమిటీ ఏర్పడాలి’ అని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో మరింత వేగవంతంగా స్పందించాలన్నారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసు జోక్యం లేకుండా చూడాలని చెప్పారు. చేపట్టిన సంస్కరణలకు రావలసినంత మైలేజీ రావడం లేదన్నారు. ఇటీవలి కాలంలో ఉన్నతాధికారుల అవినీతి తీవ్ర చర్చనీయాంశమవుతోందని, అవినీతి ఏ రూపంలో ఉన్నా, ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని.. ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..
చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని..
వైసీపీ కులాలు, మతాలు, ప్రాంతాల నడుమ చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. పాస్టర్ ప్రవీణ్ మరణంపై క్రైస్తవులను, టీటీడీ గోశాల విషయంలో హిందువులను, వక్ఫ్ బిల్లుపై ముస్లింలను రెచ్చగొట్టే విధంగా కుటిల రాజకీయం చేస్తోంది. పాస్టర్ ప్రవీణ్ విషయంలో సాంకేతిక ఆధారాలతో వైసీపీ ప్రచారానికి చెక్ పెట్టాం. అయినా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పాస్టర్ల ముసుగులో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. టీటీడీ గోశాల విషయంలోనూ వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను బయటపెట్టడం ద్వారా వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలిగాం. వక్ఫ్ బిల్లు విషయంలో ఆ పార్టీ సెల్ఫ్గోల్ వేసుకుంది. లోక్సభలో బిల్లును వ్యతిరేకించి.. వైసీపీ, రాజ్యసభలో దానికి మద్దతుగా ఓటేసింది. ఇప్పుడు ముస్లింలను మభ్యపెట్టేందుకు సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు టీడీపీపై దుష్ప్రచారం చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ ఇంతే. మనం తీసుకునే రాజకీయ నిర్ణయాల్లో అయోమయం ఉండకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలకు, క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉండాలి. తక్షణం పీ-2 కార్యక్రమంలో మంత్రులందరూ భాగస్వాములు కావాలి. మీమీ నియోజకవర్గాల పరిధిలో గానీ, రాష్ట్రంలో ఇంకెక్కడైనా గానీ పేద కుటుంబాలను ఎంపిక చేసుకుని వారికి అండగా నిలవాలి. వాటిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్ది మార్గదర్శకులుగా నిలవాలి. అప్పుడే మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాం. సూర్యఘర్ అమలులో మరింత వేగం పెరగాలి. ప్రభుత్వ భవనాలన్నిటిపై సౌర విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమివ్వాలి, పంచాయతీలకు కరెంటు బిల్లుల చెల్లింపు భారంగా ఉన్న నేపథ్యంలో పంచాయతీల పరిధిలో సౌర విద్యుదుత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి. దీనివల్ల కరెంటు బిల్లుల రూపంలో ప్రస్తుతం చేస్తున్న ఖర్చులో చాలా ఆదా అవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Dy Collectors Transfer: భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..
National Herald Case: ఈడీ ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ పేర్లు
BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త
Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
Hyderabad Summit:హైదరాబాద్కు రాహుల్ గాంధీ..
For AndhraPradesh News And Telugu News
Updated Date – Apr 16 , 2025 | 05:10 AM