ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ను వాడేస్తున్నారు. గతంలో ఒక లీటర్ బాటిల్స్ వచ్చేవి, ఇప్పడు హాఫ్ లీటర్, అంతకంటే చిన్న చిన్న బాటిల్స్ కూడా వస్తున్నాయి. ఆ బాటిల్తో నీళ్లు తాగితే ఒక్క గుక్కకే అయిపోతాయి. అయినా కూడా వాటిని ఫ్యాషన్గా వాడుతున్నారు. అంతెందుకు విందు సమయాల్లో ప్రతి మనిషికి ఒక బాటిల్ చెప్పున పెడుతున్నారు. దీంతో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం పెరిగిపోయి.. ఆ తర్వాత పర్యావరణానికి నష్టం కలుగుతోంది. అయితే తాజాగా పెళ్లిళ్లు, ఫంక్షన్స్లో ఈ ప్లాస్టిక్ బాటిల్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ, వాటితే కఠిన చర్యలు తీసుకోవాలని కేరళా హైకోర్టు పేర్కొన్నారు.
చిన్న ప్లాస్టిక్ బాటిళ్లు హాని కలిగిస్తున్నాయని, అధికారిక కార్యక్రమాలలో ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. రీసైకిల్కి పనికిరాని ప్లాస్టిక్ను తొలగించడానికి కఠినమైన చర్యలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై నిషేధాన్ని ఆచరణాత్మకంగా ఎలా అమలు చేయవచ్చు? అని కోర్టు ప్రశ్నించింది. 2016 ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలకు సంబంధించిన అంశాలపై కోర్టు సుమోటో కేసును విచారిస్తోంది. కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ను నిషేధించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
100 మందికి పైగా పాల్గొనే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ను ఉపయోగించాలంటే లైసెన్స్ అవసరమని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ లైసెన్స్లను జారీ చేసే అధికారం స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఉంది. వివాహ విందులలో అర లీటర్ నీటి సీసాలు వాడటంపై నిషేధం ఉంది అని స్థానిక స్వపరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి అన్నారు. రైల్వే ట్రాక్లను చెత్త లేకుండా ఉంచాల్సిన బాధ్యత రైల్వేలకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. రైల్వేలు ట్రాక్లపై చెత్త వేయడానికి అనుమతి ఇవ్వకూడదని, చెత్తను పూర్తిగా తొలగించాలని హైకోర్టు రైల్వే అధికారులను ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.