Padma Bhushan Balakrishna: తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, హిందూపురం ఎమ్మెల్యే,బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం పొందారు. ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలయ్య తెలుగుదనం ఉట్టి పడేలా పంచె కట్టుతో హాజరయ్యారు. సినీ రంగానికి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
తెలుగు జాతికి, భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. తన సుదీర్ఘ కెరీర్లో వందకు పైగా చిత్రాలలో నటించారు. ఇప్పటికీ యువ కథానాయకులకు దీటుగా వరుస సినిమాల్లో నటిస్తూ తన క్రమశిక్షణను, కళామతల్లిపట్ల ఉన్న అంకిత భావాన్ని చాటారు. మాస్, యాక్షన్ చిత్రాలతో పాటు, పౌరాణిక, చారిత్రక, సాంఘిక పాత్రలలో కూడా తనదైన నటనతో మెప్పించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు బాలయ్య. గతంలో కూడా అనేక ఫిలింఫేర్, నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు బాలకృష్ణ.
ఇవాళ పద్మభూషణ్ అవార్డు అందుకున్న తరుణంలో బాలయ్యకు ప్రశంసలు కురిపిస్తున్నారు.వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ,కాంగ్రెస్,బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు తమ అభినందనలను వివిధ రూపాల్లో తెలియచేస్తున్నారు.
Updated Date – Apr 28 , 2025 | 09:07 PM