ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) మోసాలు ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారాయి. మీ బ్యాంక్ ఖాతాలు, ఆన్లైన్ వాలెట్లు లేదా వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మీ అకౌంట్ లోని సొమ్మంతా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలో చూద్దాం.
ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దు
బ్యాంక్ అధికారి, కస్టమర్ కేర్ ఏజెంట్ లేదా ఎవరైనా ఫోన్లో ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దు. బ్యాంకులు లేదా నిజమైన సంస్థలు ఎప్పుడూ ఓటీపీ కోసం కాల్ చేయవు. ఇది గుర్తుంచుకోండి. ఓటీపీ మీ ఖాతాకు తాళం లాంటిది.
అనుమానాస్పద కాల్స్కు స్పందించొద్దు
“మీ ఖాతా బ్లాక్ అయింది” లేదా “మీకు రివార్డ్ వచ్చింది, ఓటీపీ చెప్పండి” అంటూ కాల్స్ వస్తే జాగ్రత్త! వెంటనే ఫోన్ పెట్టేయండి. నిజమైన సమస్య ఉంటే, బ్యాంక్ అధికారిక యాప్ లేదా వెబ్సైట్ ద్వారా చెక్ చేయండి.
లింక్లపై క్లిక్ చేయొద్దు
ఓటీపీ కోసం వచ్చిన మెసేజ్లో ఏదైనా లింక్ ఉంటే దాన్ని తాకొద్దు. మోసగాళ్లు ఫేక్ లింక్ల ద్వారా మీ ఫోన్లోకి చొరబడి సమాచారం దొంగిలించవచ్చు. లింక్ క్లిక్ చేయకుండా, ఓటీపీని మాన్యువల్గా ఎంటర్ చేయండి.
స్క్రీన్ షేరింగ్ యాప్లకు దూరంగా ఉండండి
“మీ సమస్యను సాల్వ్ చేస్తాం” అంటూ ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్ లాంటి యాప్లను డౌన్లోడ్ చేయమని అడిగితే అస్సలు వినొద్దు. ఇవి మీ ఫోన్ను పూర్తిగా మోసగాళ్ల చేతుల్లోకి ఇచ్చినట్టే.
రెండు-దశల ధృవీకరణ (2ఎఫ్ఏ) ఆన్ చేయండి
మీ బ్యాంక్ ఖాతా, ఈమెయిల్, లేదా ఇతర ఆన్లైన్ ఖాతాలకు రెండు-దశల ధృవీకరణ ఆప్షన్ ఉంచండి. ఓటీపీతో పాటు మరో లేయర్ రక్షణ ఉంటే మోసం జరిగే అవకాశం తగ్గుతుంది.
మీ ఫోన్ను సురక్షితంగా ఉంచండి
ఫోన్లో లాక్ సెట్ చేయండి. పాస్వర్డ్ లేదా ఫింగర్ప్రింట్ ఉపయోగించండి. ఓటీపీ మెసేజ్లు ఎవరి చేతికీ చిక్కకుండా చూసుకోండి.
మోసం జరిగితే వెంటనే రిపోర్ట్ చేయండి
ఒకవేళ మీ ఓటీపీ దొంగలకు చిక్కి, డబ్బు పోయినట్టు అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్కు ఫోన్ చేసి ఖాతాను బ్లాక్ చేయండి. సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
యాక్సిస్ బ్యాంకు కొత్త పంథా..
తాజాగా భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి, ఓటీపీ సంబంధిత మోసాల నుంచి కస్టమర్లను కాపాడేందుకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘ఓపెన్’ యాప్లో తొలిసారిగా ‘ఇన్-యాప్ మొబైల్ ఓటీపీ’ సౌలభ్యాన్ని ప్రారంభించింది. ఈ సరికొత్త సౌలభ్యం ఎస్ ఎంఎస్ ద్వారా ఓటీపీ పంపే బదులు, నేరుగా సమయ ఆధారిత పాస్వర్డ్లను (టీవోటీపీ) సృష్టిస్తూ టెలికాం నెట్వర్క్లపై ఆధారపడే అవసరాన్ని తొలగిస్తుంది. ఇది వేగవంతమైన, అత్యంత సురక్షిత ప్రామాణీకరణను అందిస్తూ మోసాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సైబర్ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఎస్ ఎంఎస్ ఆధారిత ఓటీపీలను లక్ష్యంగా చేసిన సిమ్ స్వాప్, ఫిషింగ్ దాడుల సందర్భంలో, యాక్సిస్ బ్యాంక్ ‘ఇన్-యాప్ మొబైల్ ఓటీపీ’ సదుపాయం మోసాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.