
తెలంగాణ బీజేపీ అనుకున్నది సాధించగలిగిందా? ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్లో వేరే పార్టీ సభ్యుల ఓట్లు కమలానికి పడ్డాయా? ఉన్నబలంకంటే ఒక్కటి రెండు ఓట్లు ఎక్కువ సాధించినా సక్సెస్ అయినట్టేననన్న కాషాయ దళం ఆశలు నెరవేరే అవకాశ ఉందా? ఈ విషయమై ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలో? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. శుక్రవారంనాడు ఫలితం వస్తుంది. ఈ క్రమంలో బీజేపీ ఆడిన మైండ్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అయింది? ఆ పార్టీ అనుకున్నది సాధించగలిగిందా లేదా అన్న చర్చ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. మొత్తం 88 మంది ప్రజాప్రతినిధులు ఓటేశారు. మొత్తం నాలుగు పార్టీలకు అవకాశం ఉండగా… పోటీలో ఉన్న బీజేపీ, మజ్లిస్తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్, ఇతర ప్రజా ప్రతినిధులు ఓటేశారు. కానీ… బీఆర్ఎస్ సభ్యులు మాత్రం పోలింగ్ బూత్కు దూరంగా ఉన్నారు. పోటీలో లేనందున ఏ పార్టీకి వేస్తే రాజకీయంగా ఎలాంటి తంటాలు వస్తాయోనన్న ఉద్దేశ్యంతో ఓటింగ్కు వెళ్ళవద్దంటూ ఏకంగా విప్ జారీ చేసింది గులాబీ పార్టీ. అగి వేరే సంగతి. అయితే… సరిపడా బలం లేకున్నా…. బరిలో దిగి హైప్ తీసుకొచ్చింది బీజేపీ. పైగా మేటర్ని సీరియస్గా తీసుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పార్టీ ముఖ్యనేతలంతా ఈ ఎన్నిక గురించి మాట్లాడారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ వరుస మీటింగ్ లు పెట్టారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ని టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చారు బీజేపీ లీడర్స్. ఆత్మప్రభోదానుసారం ఓటేయమని, హైదరాబాద్ని ఎంఐఎంకి తాకట్టు పెట్టవద్దని రకరకాలుగా ఎమోషన్స్ని టచ్ చేశారు. అయితే… ఆ పార్టీ హంగామా చేసినంత సీన్ అయితే పోలింగ్లో కనిపించలేదంటున్నారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మాత్రం పార్టీ నిర్ణయం ప్రకారం పోలింగ్కు దూరంగా ఉన్నారు. భవిష్యత్లో కార్పొరేటర్ సీటు గ్యారంటీ అని బీజేపీ ఇచ్చిన హామీ కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించలేదంటున్నారు. ఈ క్రమంలో ఓటేసిన కాంగ్రెస్ కార్పొరేటర్స్లో ఒకరిద్దరేమన్నా పక్క చూపులు చూశారా? లేక వాళ్ళు కూడా వంద శాతం పార్టీలైన్లోనే ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. తనకు కొన్ని తమ పార్టీయేటర ఓట్లు పడ్డాయని బీజేపీ అభ్యర్థి చెప్పడాన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ఒకరిద్దరు తేడా చేశారా? లేక ఇది కూడా మైండ్ గేమ్లో భాగమా అన్న చర్చ కాంగ్రెస్లో జరుగుతోందట. ఉన్న బలంకంటే… ఒకటి రెండు ఓట్లు ఎక్కువ సాధించినా అదే మాకు పదివేలని మొదట్నుంచి చెబుతోంది కాషాయదళం. మరి ఆ టార్గెట్ రీచ్ అయ్యారా లేదా అన్నది తేలాలంటే…. తుది ఫలితం వెలువడేదాకా ఆగాల్సిందే.