off the record over Phone Tapping

Written by RAJU

Published on:

off the record over Phone Tapping

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సీఎం రేవంత్‌ రేవంత్‌రెడ్డి మరింత సీరియస్‌గా తీసుకున్నారా? ఇక వాళ్ళు వీళ్ళు కాదని స్వయంగా ఆయనే రంగంలోకి దిగారా? ఢిల్లీ టూర్‌ సీక్రెట్స్‌లో ఇది కూడా ఉందా? ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విషయంలో అసలేం జరుగుతోంది? విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరు నిందితుల సంగతేంది?ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం పక్కకు పోయింది…. సీఎం రేవంత్‌ రెడ్డి ఆ కేసును పట్టించుకోవడంలేదు….. ఇదంతా పొలిటికల్‌ డ్రామా అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో అదంతా ఉత్తుత్తిదేనని, మేటర్‌ బాగా సీరియస్‌గానే ఉందన్నది ప్రభుత్వ వర్గాల ఇన్‌సైడ్‌ టాక్‌. ఫోన్ తీగల్ని ఎవరి మెడకు చుట్టాలో, ఎవరిని కేసులో భాగస్వామ్యుల్ని చేయాలో అంతర్గతంగా పోలీసు అధికారులతో తీవ్రంగానే చర్చిస్తున్నారట సీఎం. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి… విదేశాలకు వెళ్ళిపోయిన ఇద్దర్ని దేశానికి రప్పిస్తే తప్ప…, అప్పటి ప్రభుత్వ పెద్దలను ఇందులో భాగస్వామ్యులను చేయడం కుదరదని తెలిసిన రేవంత్‌ రెడ్డి…. ఆ దిశగానే అడుగులేస్తున్నారట. ప్రత్యక్షంగా ఆయన ఈ కేసులో జోక్యం చేసుకోకపోయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా…. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కూడా జోక్యం చేసుకోమని ఒక కేంద్ర మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఒకరు కెనాడాలో,ఇంకొకరు బ్రెజిల్‌ ఉన్నట్లు సమాచారం ఉందట ప్రభుత్వానికి. ఈ ఇద్దరిని రప్పించాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం తప్పనిసరి. అందుకే సీఎం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని ఈ విషయంలో జోక్యం చేసుకోమని కోరినట్టు తెలుస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌ను మొన్న ఢిల్లీ టూర్‌లో కలిశారు రేవంత్‌ రెడ్డి. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న మిస్‌ వరల్డ్‌, గ్లోబల్‌ డీప్‌ టెక్‌ సదస్సు, భారత్‌ సమ్మిట్‌ యానిమేషన్‌ గేమింగ్‌, విఎఫ్‌ఎక్స్‌కు సహకరించాలని కోరారు. ఇదంతా అధికారికంగా సీఎం రేవంత్‌ రెడ్డి విదేశాంగ మంత్రి జైశంకర్‌కు చేసిన విన్నపం. దీంతో పాటు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇద్దరు కీలక నిందితులను రప్పించడానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి చెవిలో వేసినట్లు తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో గుసగుసలు బయలుదేరాయి.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పలువురు నిందితులు విదేశాలకు వెళ్లి తలదాచుకున్నారని, వారిని భారత్‌కు రప్పించి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఉందంటూ…విషయాన్ని కేంద్ర మంత్రితో పంచుకున్నారట రేవంత్‌. ఇందుకోసం ఆయా దేశాల విదేశాంగ శాఖలతో చర్చించి సహకరించాలని కోరినట్టు తెలిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌ అంతా…. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే జరిగిందని, ఆయన్ని ఇండియాకు రప్పిస్తే, ఈ కుట్ర వెనుక ఉన్న అసలైన వ్యక్తులు బయటపడతారని, మరిన్ని అరెస్టులు కూడా చేయాలని భావిస్తున్నామని కేంద్ర మంత్రికి రేవంత్‌ వివరించినట్లు సమాచారం. ప్రభాకర్ రావు వెనుక ఒక బలమైన వ్యవస్థ పని చేసినట్లు కనిపిస్తోందని, అందుకే విదేశాంగ జోక్యం అవసరమని రేవంత్‌ కేంద్ర మంత్రికి చెప్పినట్టు ప్రచారం ఉంది. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుకు రెడ్‌ కార్నర్‌ నోటీసులు ఇష్యూ అయ్యాయని, విదేశాంగ శాఖ ద్వారా ఇంటర్‌పోల్‌ సహాయంతో ఇద్దరినీ రప్పించాలని, సిబిఐ జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహించాలని సీఎం కోరినట్టు చెప్పుకుంటున్నారు. పైకి ప్రచారం జరుగుతున్నట్టు ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో రేవంత్‌రెడ్డి నాన్‌ సీరియస్‌గా ఏం లేడని, లోలోపల పెద్ద గ్రౌండ్‌ వర్కే చేస్తున్నారన్నది ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ కేసులో ఎంతవరకైనా వెళ్లాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నట్లు ఇటీవలి పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ కేసులో సిబిఐ…. తెలంగాణ పోలీసులకు, ఇంటర్‌ పోల్‌కు మధ్యవర్తిత్వం వహిస్తుందా? నిందితులను దేశానికి రప్పిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Phone Tapping వ్యవహారాన్ని Revanth Reddy సీరియస్‌గా తీసుకున్నారా..? | OTR | Ntv

Subscribe for notification