
తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం ఒకర్ని టార్గెట్ చేస్తే…. ఇంకొకరు పడ్డారా? ఎవరి కోసమో…. వల విసిరితే ఇంకెవరో పడ్డారా? జస్ట్ మిస్ అని కొందరు, అబ్బే…. అదేం లేదు, మెడమీద కత్తి వేలాడుతూనే ఉందని మరికొందరు అసెంబ్లీ లాబీల్లో ఎవర్ని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు? ఇంతకీ కాంగ్రెస్ ఎవర్ని టార్గెట్ చేస్తే… జగదీష్రెడ్డి దొరికారు? తెలంగాణ అసెంబ్లీలో గురువారం జరిగిన రచ్చ….బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డిని సస్పెండ్ చేసేదాకా వెళ్ళింది. దీంతో కొత్త చర్చ మొదలైంది. ప్రతిపక్ష సభ్యుల వ్యవహారశైలిని ఏడాదిన్నర పాటు చూశారని, గొడవ చేసినా, మాటిమాటికీ పోడియం దగ్గరకు వెళ్లినా పోన్లే అంటూ వదిలేశారని, ఇప్పుడిక శృతిమించడంతో… కఠినంగానే ఉండాలని డిసైడైనట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. బడ్జెట్ సమావేశాల తొలిరోజే… ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్లకు క్లాస్ పీకారు సీఎం. దాంతో ఛార్జ్ అయిన ఎమ్మెల్యేలు అటెన్షన్లో ఉన్నారట. అదే సమయంలో ఛైర్ని అవమానించేలా జగదీష్ రెడ్డి మాట్లాడటం, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడంతో అధికార పక్షం ఫ్లోర్ కో ఆర్డినేషన్ బాగా వర్కౌట్ అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే… ఇక్కడే అసలు టార్గెట్ మిస్ అయిందన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. అధికార పక్షం ఒకర్ని లక్ష్యంగా పెట్టుకుంటే…. వలలో మరో నాయకుడు చిక్కాడని అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సభలో వ్యవహరిస్తున్న తీరుపట్ల అటు స్పీకర్, ఇటు మంత్రులు చాలా రోజులుగా కాస్త అసహనంతో ఉన్నారట. గత సమావేశాల్లోనే… బీఆర్ఎస్ సభ్యుల వ్యవహార శైలికి సంబంధించిన వీడియోలు విడుదల చేసిన స్పీకర్… ఈసారి కూడా అదే తరహాలో మాటిమాటికీ పోడియం దగ్గరికి వస్తే ఉపేక్షించేది లేదనిఅన్నారట. అలా చేస్తే… ఈ సెషన్లో కౌశిక్ రెడ్డి పై వేటు వేయాలని డిసైడ్ అయ్యారన్న చర్చ నడిచింది అధికార పార్టీలో. ఐతే..గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డి… స్పీకర్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. అటు స్పీకర్ కూడా ఇప్పటి వరకు చూసీ చూడనట్టుగా ఉన్నా.. గురువారం నాటి ఎపిసోడ్లో కఠినంగానే వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది.
దీన్ని ఎథిక్స్ కమిటీకి పంపి విచారణ వేగవంతంగా ముగించాలని జిల్లా మంత్రుల నుండి ఒత్తిడి ఉందట. జగదీష్రెడ్డి మీద కఠిన చర్య తీసుకోవడం ద్వారా….. సూర్యాపేటలో ఉప ఎన్నిక వచ్చేలా వర్కౌట్ చేయాలనే ఆలోచన అధికార పక్షంలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ బైపోల్ జరిగితే….బీఆర్ఎస్ని తేలిగ్గానే కొట్టొచ్చన్న ఫీలింగ్ కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సభలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూపొందించిన నియమావళినే.. వాళ్ళే ఉల్లంఘిస్తే ఇక కఠినంగా ఉండాలని చూస్తోందట ప్రభుత్వం. ఆక్రమంలోనే ఇప్పటికీ కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచినట్టు చెప్పుకుంటున్నారు. సభలో ఏం మాట్లాడినా వినడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నా… స్పీకర్ పోడియం దగ్గరకు రావడం ఏంటి? ఒకవేళ అలా వచ్చినా.. దురుసుగా ప్రవర్తించినా చర్యలకు ఉపక్రమించే ఆలోచనలో ఉందట సర్కార్. సభ్యులు కూడా యాక్టివ్ అవడంతో….ఇక తగ్గేదేలే అనే లెవల్ లో సభ ఉంటుందన్న అభిప్రాయం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగదీష్ రెడ్డిని సస్పెన్షన్తోనే వదిలేస్తారా..? లేక అంతకు మించి చర్యలు ఉంటాయా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా…. ప్రభుత్వం కాస్త అవకాశం ఇస్తే…. దాన్ని ప్రతిపక్షం అలుసుగా తీసుకుందని, ఇకపై అలా కుదరదన్న సంకేతాలు పంపినట్టు అయిందంటున్నారు పరిశీలకులు. ఏడాదిన్నర సమయం ఇచ్చాం.. పాత, కొత్త సభ్యులు అనేది లేకుండా కఠినంగా వ్యవహరిద్దామని అనుకుంటోందట అధికార పక్షం.