- రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు బీసీలే
- బీసీని లేదా ఎస్సీని రాష్ట్ర అధ్యక్షుడిని చేయండి
- విలాసాలకు హెలికాప్టర్ వాడే అలవాటు లేదు
- మీలాగా సొంత హెలికాప్టర్ కాంగ్రెస్ కు లేదు
- ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేటీఆర్ దమ్ముంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పదవి తెచ్చుకో అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి లాగ పీసీసి అధ్యక్షుడు అయిన రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రివి కావాలన్నారు. మీడియాతో మాట్లాడిన అద్దంకి.. బీఆర్ఎస్, కేటీఆర్ను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు బీసీలే అన్నారు. దమ్ముంటే తమ పార్టీలో బీసీని లేదా ఎస్సీని రాష్ట్ర అధ్యక్షుడిని చేయండి? అని ప్రశ్నించారు.
READ MORE: PM Modi: పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్ సభలో పాల్గొన్న మోడీ
బీఆర్ఎస్ లాగ విలాసాలకు హెలికాప్టర్ వాడే అలవాటు కాంగ్రెస్ కు లేదని.. తమలాగా సొంత హెలికాప్టర్ కాంగ్రెస్కు లేదని అద్దంకి దయాకర్ అన్నారు. “రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉంటే ఆర్థిక భారం పడకుండా హెలికాప్టర్ వాడుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని పెడుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవాలా? టీఆర్ఎస్ రజతోత్సవాలా? బీఆర్ఎస్ పుట్టి 3ఏళ్లు, టీఆర్ఎస్ కనుమరుగై మూడు ఏళ్లు. దేని రజతోత్సవాలో చెప్పాలి. బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు అని కేటీఆర్ అంటున్నారు. జనతా గ్యారేజ్ లో ఓనర్ కొడుకు విలన్. మీ జనతా గ్యారేజ్ లో కేటిఆర్ నువ్వు విలన్ అన్నట్లా? కేసీఆర్ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటున్నారు. ఇప్పటికే కేటిఆర్, హరీష్ రావు, కవితలు ప్రజలకు కథలు చెప్తున్నారు. కేసీఆర్ బయటకు వచ్చి పిట్ట కథలు చెప్తారా?” అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు.
READ MORE: NVSS Prabhakar: వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్లో ఉన్నారు..
సభ కోసం 300 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని తరలిస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. చేయి గుర్తుకు వ్యతిరేకంగా గులాబీ కాడకు కమలం పువ్వు అంటుపెట్టారని.. సన్న బియ్యం తెలంగాణలో ఇస్తుంటే.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదో బీజేపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కోసమే బ్రతుకుతున్నదని.. మళ్ళీ ఎన్డీయేలకు పోవాలని కేటిఆర్ చంద్రబాబుకు బిస్కెట్లు వేస్తున్నడని విమర్శించారు.