ABN
, Publish Date – Mar 22 , 2025 | 04:28 AM
సెంట్రల్ జీఎస్టీ మెదక్ రేంజ్ సూపరింటెండెంట్ రవిరాజన్ అగర్వాల్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ జీఎస్టీ విభాగంలో ఉన్నతాధికారి అయి న రవిరాజన్ అగర్వాల్.. ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

-
3 గంటల పాటు జీఎస్టీ కార్యాలయంలో సోదాలు
-
ఓ వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేసినందుకే..
మెదక్ అర్బన్/హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్ర జ్యోతి): సెంట్రల్ జీఎస్టీ మెదక్ రేంజ్ సూపరింటెండెంట్ రవిరాజన్ అగర్వాల్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ జీఎస్టీ విభాగంలో ఉన్నతాధికారి అయి న రవిరాజన్ అగర్వాల్.. ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మెదక్ జీఎస్టీ కార్యాలయంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వర కు దాదాపు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించి, పలు కీలక పత్రాలను స్వాఽధీనం చేసుకున్నారు. సాయంత్రం సూపరింటెండెంట్ రవిరాజన్ను అరెస్టు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి, రిమాండ్ కోసం హైదరాబాద్ తరలించినట్లు సీబీఐ ఇన్స్పెక్టర్ ప్రకాష్ తెలిపారు.
సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కల పోచమ్మ గల్లీకి చెందిన తలారి కృష్ణమూర్తి కొన్నేళ్లుగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ హార్డ్వేర్ షాపు నడుపుకొంటున్నారు. షాపునకు సంబంధించిన జీఎస్టీ నంబర్ రద్దు కావడంపై గత ఏడాది డిసెంబరు 24న మెదక్ సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంట్ను కలిశారు. జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయనందున నంబర్ రద్దయిందని, పునరుద్ధరణకు రూ.10వేలు లంచం ఇవ్వాలని రవిరాజన్ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 14న సూపరింటెండెంట్ ఇచ్చిన ఫోన్ నంబర్ ఖాతాకు కృష్ణమూర్తి రూ.8వేలు పంపించారు. అనంతరం ఈ విషయమై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు రవిరాజన్ను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date – Mar 22 , 2025 | 04:28 AM