లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా ఉద్యోగాలు
వచ్చే ఐదేళ్లలో 4 లక్షల కొత్త కొలువులు
వర్సిటీల్లో పీజీ సీట్లు మాత్రం పదుల సంఖ్యలో
ఎమ్మెస్సీ లైఫ్సైన్సెస్ సీట్ల కొరత
పీహెచ్డీ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిందే
నేటి నుంచి బయోఏషియా సదస్సు
హైదరాబాద్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): జీనోమ్ వ్యాలీలో ఆరేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తూ, 50కిపైగా దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్న ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ ఇటీవలే ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఉత్పత్తి విభాగంలో 15 మంది ఉద్యోగులు కావాలని పేర్కొంది… ఎమ్మెస్సీ/ఎంటెక్లో బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి, 3 నుంచి 5 సంవత్సరాల అనుభవమున్న వారిని అర్హులుగా పేర్కొంది. ఎంపికైనవారికి వార్షిక వేతనం రూ.22 లక్షలు. వివిధ రాష్ట్రాల నుంచి వందకుపైగా అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తుచేశారు.
వారిలో తెలంగాణకు చెందినవారు నలుగురు ఉండగా.. ఒక్కరూ ఎంపిక కాలేదు. అలాగే.. షామీర్పేటలోని ఒక బయోరిసెర్చ్ కంపెనీ లైఫ్ సైన్సె్సలో ఎమ్మెస్సీ చేసిన 45 మందిని ఎంపిక చేసుకోగా.. అందు లో తెలంగాణకు చెందినవారు ఒక్కరు మాత్రమే ఉండడం గమనార్హం. ఇవే కాదు కొత్త నియామకాల కోసం ఇక్కడి కంపెనీలు నిరంతరం ప్రకటనలు ఇస్తూ ఉన్నా.. ఎంపికవుతున్నవారు మాత్రం అత్యధికంగా స్థానికేతరులే. నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కంపెనీలను కోరుతున్నా.. పరిశ్రమల అవసరాలకు సరిపడే అర్హతలు, నైపుణ్యాలున్న స్థానికులు లభించని పరిస్థితి నెలకొంది.
జీనోమ్వ్యాలీలో 18 దేశాల కంపెనీలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 4.20 లక్షల సీట్లు ఉండగా, ఇందులో దాదాపు 1.45 లక్షల సీట్లు సైన్స్ గ్రూప్ బీఎస్సీకి సంబంధించినవి. ఈ సీట్లు ప్రతి ఏటా 100ు నిండిపోతాయి. ఈ కోర్సు పూర్తిచేసినవారికి రాష్ట్రంలోని 15 ప్రభుత్వ వర్సిటీల్లో పీజీ స్థాయిలో 30వేల దాకా సీట్లుండగా.. వాటి లో ఎమ్మెస్సీ లైఫ్సైన్సెస్ సీట్లు 1500 లోపే. అయితే.. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం గత రెండు దశాబ్దాలుగా ఏటా అభివృద్ధి నమోదుచేస్తోంది. ప్రపంచ వ్యాక్సిన్ల కేంద్రంగా పేరుగాంచిన జీనోమ్ వ్యాలీలో భారత్ సహా 18 దేశాలకు చెందిన 200కు పైగా ప్రముఖ ఫార్మా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆగమేఘాలపై కొవిడ్ టీకా తయారుచేసిన భారత్ బయోటెక్తోపాటు బయోలాజికల్-ఈ, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లాంటి దిగ్గజ ఫార్మా కంపెనీలు ఇక్కడ ఉన్నా.. వాటిలో కొలువులు సాధించేందుకు కావాల్సిన అర్హతల ను రాష్ట్రవాసులు దక్కించుకోలేకపోతున్నారు.
ప్రపంచం వినియోగించే మొత్తం టీకాల్లో మూడోవంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని, లైఫ్సైన్సెస్ రంగంలో స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయి లో పరిస్థితి భిన్నంగా ఉంది. మొత్తం జీనోమ్ వ్యాలీతోపాటు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన ఫార్మా కంపెనీలు ప్రత్యక్షంగా దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తుండగా.. ఇందులో కొలువులు పొందుతున్న స్థానికులు 5శాతం కూడా ఉండట్లేదు.
వర్సిటీలు మేల్కొనేదెన్నడు?
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు, కొత్త పాఠ్యాంశాలు అమలుచేస్తామన్న విద్యాశాఖ గొప్పలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యలో ఇప్పటి ట్రెండ్కు అనుగుణంగా.. బీటెక్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సీట్లకు కోత విధించి డేటా సైన్స్, ఏఐ, ఐవోటీ, రోబోటిక్స్ లాంటి కోర్సులను ప్రవేశపెట్టిన ప్రభు త్వం లైఫ్సైన్సెస్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జీనోమ్ వ్యాలీ ఇప్పటికే ప్రముఖ కంపెనీలతో నిండిపోగా.. దేశంలోని అతిపెద్ద హైదరాబాద్ ఫార్మాసిటీ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిని ప్రభుత్వం 19వేల ఎకరాల్లో నిర్మిస్తోంది. ఇది కూడా అందుబాటులోకి వస్తే.. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 4 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్ స్వయంగా పేర్కొన్నారు. ఆ ఉద్యోగాలను స్థానికులు దక్కించుకోవాలంటే పీజీ స్థాయిలో లైఫ్ సైన్సెస్ సీట్లు మరిన్ని అందుబాటులోకి రావాల్సి ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలోని 15 ప్రభుత్వ వర్సిటీల్లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫిజియో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్ లాంటి పూర్తిస్థాయి లైఫ్ సైన్సెస్ కోర్సులు అందించేవి 8 మాత్రమే ఉన్నాయి. మిగతా వ ర్సిటీలు సాధారణ పీజీ కోర్సులకే పరిమితమయ్యాయి. ఉన్న వర్సిటీల్లోనూ ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్ సీట్లు తగినన్ని లేవు. ఏటా ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేస్తుండగా.. ఎమ్మెస్సీలో ఒక్కో సీటుకు పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారు. విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్నా.. సీట్లు మాత్రం పెంచకపోవడంతో ఫార్మా కంపెనీల్లో ఉన్న అద్భుతమైన అవకాశాలను రాష్ట్రవాసులు దక్కించుకోలేకపోతున్నారు.
పీహెచ్డీ.. పదుల సంఖ్యలోనే!
ఎమ్మెస్సీ, ఎంటెక్ స్థాయిలోనే పరిస్థితి ఇలాఉంటే.. పీహెచ్డీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. లైఫ్ సైన్సె్సలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలోనే ఉన్నారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇక్కడి ఫార్మా పరిశోధన కంపెనీ ల్లో పీహెచ్డీ చేసినవారికి వార్షిక ప్యాకేజీ రూ.50ల క్షల నుంచి రూ.2 కోట్ల దాకా ఉంటోంది. ఈ ఉద్యోగాలనూ ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారు. లైఫ్ సైన్సె్సలో పీహెచ్డీ చేయాలని ఆసక్తి ఉన్నా నాణ్యమైన విద్య రాష్ట్రంలో లభించకపోవడంతో.. దీనికోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సివస్తోంది. ఆర్థిక స్థోమ త ఉన్నవారు విదేశాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నానాటికీ మరింత వృద్ధి చెందుతున్న లైఫ్సైన్స్ రంగంలో డిగ్రీ, పీజీస్థాయిలో కోర్సులపై, సీట్ల సంఖ్య పెంపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.