JNTU: జేఎన్‏టీయూ వీసీ నియామకం మరింత ఆలస్యం..

Written by RAJU

Published on:

– ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో నిలిచిన ఉత్తర్వులు

– మరో నెలరోజుల పాటు కొనసాగనున్న ఇన్‌చార్జ్‌ వీసీ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్‌ సిటీ: జేఎన్టీయూ(JNTU)కు కొత్త వైస్‌చాన్స్‌లర్‌ నియామకం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది మే 21న ఖాళీ అయిన వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా సాంకేతిక కారణాల రీత్యా నియామక ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడింది. జనవరి 27న సెర్చ్‌ కమిటీ సమావేశం జరిగినప్పటికీ, తాజాగా శాసనమండలి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో మూడోసారి నియామక ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో రెండు నెలలుగా జేఎన్‌టీయూకు ఇన్‌చార్జ్‌ వైస్‌చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్న ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. స్వల్పకాలానికి ఇన్‌చార్జ్‌ వీసీగా వచ్చిన డాక్టర్‌ బాలకిష్టారెడ్డికి జేఎన్‌టీయూ వీసీగా మరో నెలపాటు గడువు లభించడంతో యూనివర్సిటీ పాలనపై పట్టు బిగించారు. తాజాగా వివిధ విభాగాలు, హోదాల్లో పనిచేస్తున్న పలువురు బోధన, బోధనేతర సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: స్పెయిన్‌ దేశస్థులను ఆకర్షిస్తున్న మసీదు..

బిక్స్‌ కొత్త డైరెక్టర్‌గా శ్రీనివాసులు

యూనివర్సిటీలో కీలకమైన బ్యూరో ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ కన్సల్టెన్సీ సర్వీసె్‌స(బిక్స్‌) విభాగానికి నూతన డైరెక్టర్‌గా సివిల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీనివాసులును వీసీ ఆదేశాల మేరకు నియమిస్తూ రిజిస్ట్రార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్‌ వెంకటేశ్వరరెడ్డిని సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి బదిలీ చేశారు. అలాగే, గతేడాది మంథని కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌ క్యాంపస్‌ కళాశాలకు వచ్చిన ప్రొఫెసర్‌ విష్ణువర్థన్‌ డిప్యుటేషన్‌ను రద్దు చేయడంతో ఆయన తిరిగి మంథని కళాశాల ప్రిన్సిపాల్‌ పోస్టుకు వెళ్లిపోయారు. అలాగే, పరీక్షల విభాగం కంట్రోలర్‌ను కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయగా, ఇదే విభాగం నుంచి మరో ముగ్గురు అధికారులను సొంత విభాగాలకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డిప్యూటేషన్లను రద్దు చేసే అవకాశం

మరోవైపు గత వీసీ హయాంలో జగిత్యాల జేఎన్‌టీయూ కాలేజీ నుంచి డిప్యూటేషన్‌పై భారీ సంఖ్యలో హైదరాబాద్‌ క్యాంప్‌సకు వచ్చిన ప్రొఫెసర్ల డిప్యూటేషన్లను సైతం రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌కు వచ్చిన ప్రొఫెసర్లు టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణతో పాటు పలు బోధనేతర కార్యక్రమాలకే పరిమితం కావడంపై విద్యార్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగిత్యాల విద్యార్థులకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడడంతో కొందరు ప్రొఫెసర్ల డిప్యూటేషన్లను రద్దు చేసి వెనక్కి పంపాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

city9.2.jpg

బోధనేతర ఉద్యోగులకు స్థానచలనం

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సతీశ్‌ను మంథని నుంచి హైదరాబాద్‌కు, ఇంజనీరింగ్‌ విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ సుధను అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌కు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అశోక్‌ను సుల్తాన్‌పూర్‌ నుంచి ఇంజనీరింగ్‌ విభాగానికి, సూపరింటెండెంట్‌ ప్రసన్నను సిరిసిల్ల(Siricilla) నుంచి ఇంజనీరింగ్‌ విభాగానికి, సూపరింటెండెంట్‌ బాలరాజును జగిత్యాల నుంచి క్యాంపస్‌ కాలేజీకి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ వీరవేణిని వనపర్తి నుంచి మేనేజ్‌మెంట్‌ కాలేజీకి బదిలీ చేశారు. త్వరలోనే మరికొందరు నాన్‌టీచింగ్‌ రెగ్యులర్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు స్థానచలనం ఉండనుందని సమాచారం.

ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1

ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!

ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్

Read Latest Telangana News and National News

Updated Date – Feb 01 , 2025 | 10:55 AM

Subscribe for notification