జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో సభను ఏర్పాటుచేశారు. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ నుంచి ప్రజా సమస్యలను పరిష్కరించే పార్టీగా మారిందంటూ వెల్లడించారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రస్తావించారు.
ఎన్నో అవమానాలు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ నిలబడ్డారని, ఆయనకు మరింత అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఆయన కేవలం రాష్ట్రానికే కాదు.. దేశానికి ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలబడాలన్నారు. అలాగే గతంలో సభలకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టేవారని, ఇప్పుడు సభకు అనుమతి ఇచ్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సభ జరిగేందుకు ఎంతో కష్టపడిన పార్టీ నేతలు, వాలెంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టినా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఇచ్చేవారు అని గుర్తు చేసుకున్నారు.