విద్యార్థులకు ఇప్పటికీ అందని బూట్లు
సైజులు సరిపోలడం లేదని ఆలస్యం
ఈసారి బ్యాగ్ జిప్లు ఫెయిల్.. 25వేల బ్యాగ్లు వెనక్కి..
గత ఏడాది 47 లక్షల కిట్లు కొనుగోలు..
4 లక్షల మంది విద్యార్థుల డ్రాపౌట్లతో
ఈ ఏడాది 43లక్షల కిట్లే కొనుగోలు?
న్యాయ సమీక్ష లేకుండానే టెండర్లు
లొసుగులు బయటపడతాయనే నేరుగా..
జగనన్న విద్యా కానుక కిట్ల ధరలు గత ఏడాదితో పోలిస్తే ఒక్కో కిట్ రూ.1963 నుంచి రూ.2420కి పెంచారు. బడ్జెట్ కూడా రూ.931 కోట్ల నుంచి రూ.1042 కోట్లకు పెంచారు. ధర పెరిగితే విద్యార్థులకు నాణ్యమైన బ్యాగ్, ఇతర వస్తువులు అందాలి. కానీ.. ఎక్కువగా బ్యాగ్ జిప్లు ఫెయిలయ్యాయి. మరి పెరిగిన ధర ఎవరికి లాభం? కాంట్రాక్టర్లకా.. అధికారులకా?.. లేదా ప్రభుత్వ పెద్దలకా??
గతేడాది 47.4లక్షల విద్యా కానుక కిట్లను కొన్న ప్రభుత్వం ఈ ఏడాది 43.1లక్షల కిట్లను మాత్రమే కొనుగోలు చేసింది. అంటే సర్కారు బడుల్లో 4లక్షల మంది విద్యార్థులు బడి మానేసిటనట్లు(డ్రాపౌట్లు) ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది!.
మూడు జతల యూనిఫాం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. విద్యార్థులకు ఇచ్చే క్లాత్ రెండు జతలకే పరిమితమవుతోంది. ఇందులో మూడో జత డబ్బులు ఎక్కడికెళ్తున్నాయి?. ఇక.. కొలతలు సరిగ్గా తీసుకోలేదన్న సాకుతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఇంకా బూట్లు పంపిణీ చేయలేదు!. ఈ ప్రశ్నలన్నింటికీ సర్కారు ఏం సమాధానం చెబుతుంది??
(అమరావతి, ఆంధ్రజ్యోతి): జగనన్న విద్యా కానుక (Jagananna Vidya Kanuka) విషయంలో ప్రభుత్వం తీరు మారలేదు. బడులు తెరిచిన రోజే అన్నీ ఇస్తున్నామని సీఎం జగన్ (CM JAGAN) ప్రకటించి 20 రోజులు దాటినా ఇప్పటికీ అందరికీ కిట్లు అందలేదు. బూట్లు సగం మందికి కూడా అందలేదు. పిల్లల పాదాల కొలతలు సరిగా తీయలేదనే కారణం చూపి బూట్లు పంపిణీ చేయడం లేదు. మరోవైపు ఈసారి ధరలు పెంచి నాణ్యమైన బ్యాగ్లు సరఫరా చేశామని అధికారులు చెబుతుంటే వాటి జిప్లు ఫెయిల్ అవుతున్నాయనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సుమారు 25వేల బ్యాగ్లకు జిప్లు సరిగా లేవని స్వయంగా ప్రధానోపాధ్యాయులే వాటిని వెనక్కి పంపారు. కాగా, ఇప్పటివరకూ 39.9లక్షల విద్యా కానుక కిట్లను పాఠశాలలకు పంపగా 34లక్షల కిట్లు మాత్రమే విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం 43.1లక్షల కిట్లను కొనుగోలు చేసింది. దీంతో మొత్తం పంపిణీ ఎప్పటికీ పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
పెంచిన ధర ఎవరికి లాభమో?
202223 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కిట్ల విలువ భారీగా పెరిగింది. గతేడాది 47.4లక్షల విద్యా కానుక కిట్లను రూ.931కోట్లకు కొనుగోలు చేస్తే, ఈ ఏడాది 43.1లక్షల కిట్లను ఏకంగా రూ.1042కోట్లతో కొనుగోలు చేసింది. అంటే గతేడాది కిట్ విలువ రూ.1963 కాగా ఈ ఏడాది దానిని ఏకంగా రూ.2420కి పెంచారు. గతేడాది బ్యాగ్కు రూ.180 వెచ్చించగా, ఈసారి రూ.250 దాటి కొనుగోలు చేశారు. ఇక.. కానుకలోని ఇతర వస్తువుల ధరలు పెద్దగా పెరగకపోయినా అధికారులు కానుకలకు వెచ్చించిన మొత్తం అమాంతం పెంచేశారు. అంత పెంచినా బ్యాగ్లు మళ్లీ నాణ్యమైనవి ఇవ్వలేకపోయారు. గతేడాది బ్యాగ్లు చిరిగిపోగా, ఈ సారి చిరగడం లేకపోయినా జిప్లు పోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో ధరలు పెంచడం వల్ల ఎవరికి లాభం చేకూరిందో అర్థం కావట్లేదు. మరోవైపు మూడు జతల యూనిఫాం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే అది రెండు జతలకే సరిపోతోంది. కానీ అధికారులు మాత్రం మూడు జతలకు ఇచ్చినట్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు.
డ్రాపవుట్లు లక్షల్లో..
గతేడాది 9లక్షల కిట్లు మిగిలిపోయినా వాటిని ఎలా వినియోగించారో ఇప్పటికీ సమగ్రశిక్ష అధికారులు బయటకు వెల్లడించలేదు. ముందూ వెనుకా చూడకుండా ఈ ఏడాదికి కూడా అదనంగా కిట్లు సరఫరా చేసేలా కాంట్రాక్టలతో ఒప్పందాలు చేసుకున్నారు. 5శాతం అదనం అనే పేరుతో మళ్లీ 43,10,165 కిట్లు కొన్నారు. అలాగే వంద కోట్లు దాటిన టెండర్లన్నీ న్యాయసమీక్షకు పంపిస్తామని ప్రభుత్వం ప్రకటించగా… వెయ్యి కోట్లు దాటినా విద్యా కానుక కిట్ల కొనుగోళ్ల టెండర్లు న్యాయ సమీక్షకు పంపలేదు. లొసుగులు బయటపడతాయనే సమీక్షకు పంపలేదనే విమర్శలు వస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇందులో మరో కీలకాంశం ఉంది. గత ఏడాది 47.4 లక్షల కిట్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది 43.1లక్ష కిట్లే కొనుగోలు చేసిందంటే.. ఆ వ్యత్యాసం మేరకు అంటే 4 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అయినట్లు తేటతెల్లమవుతోంది. పాఠశాలల విలీనం తర్వాత డ్రాపౌట్లు పెరిగిన సంగతీ తెలిసిందే!.
అధికారిని మార్చారెందుకో?!
ఇక.. విద్యా కానుక కిట్ల కొనుగోలు అంతా సమగ్రశిక్ష కార్యాలయం కేంద్రంగా సాగుతోంది. అయితే.. కొద్ది నెలల కిందట సమగ్రశిక్ష ఎస్పీడీని మార్చడంపైనా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ముక్కుసూటిగా ఉంటారని, అందుకే తమకు కావాల్సిన విధంగా పనులు చేయించుకోవడం కోసం ఎస్పీడీని మార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే జూనియర్ అధికారిని తెరపైకి తెచ్చినట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందుకోసం సీఎంవోలో ఓ అధికారి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీన్నిబట్టి కిట్ల ధరల పెంపు వెనుక అధికారి మార్పు బలంగా పనిచేసినట్లు తెలుస్తోంది.
Updated Date – 2023-07-06T15:50:57+05:30 IST