ఆరోగ్య సమస్యలు తగ్గి.. అధికారంలోకొస్తారు.. సిద్ధాంతి నారాయణమూర్తి ‘పంచాంగం’
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ‘ఉగాది’.. బెంగళూరులోనే జగన్.. బోసిపోయిన వేడుక
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ ఓ ‘స్త్రీ’ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రముఖ సిద్ధాంతి నారాయణ మూర్తి చెప్పారు. విశ్వావసునామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉగాది వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధాంతి నారాయణమూర్తి నూతన పంచాంగాన్ని చదివి వినిపించారు. జగన్ జన్మ నక్షత్రం, మిధునరాశితో సిద్ధాంతి నారాయణమూర్తి పంచాంగ పఠనం ప్రారంభించారు. ఈ ఏడాది ఓ స్త్రీతో జగన్కు సమస్యలు ఎదురవుతాయని వెల్లడించారు. కుటుంబంలోని స్త్రీల వల్లే చిక్కులు ఎదురుకానున్నాయని తెలిపారు. అయితే.. ఆ ‘స్త్రీ’ ఎవరనేది సిద్ధాంతి వెల్లడించలేదు. కాగా.. తమ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి అవుతారని సిద్ధాంతి చెప్పడం గమనార్హం. పంచాంగ పఠనంలో రాజకీయ అంశాలను కూడా నారాయణ మూర్తి స్పృశించారు. జగన్ను ఓడించినందుకు ప్రజలు ఇప్పుడు తప్పుచేశామా అని బాధపడుతున్నారని పేర్కొన్నారు. నాయకుడిగా జగన్ డబ్బును కోల్పోయి, మాటలు అనిపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది రాజకీయంగా పూర్వవైభవాన్ని దక్కించుకుంటారని తెలిపారు. ఆరోగ్యరీత్యా జగన్ ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోందని, ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. కుటుంబ రీత్యా ఇబ్బందులు కూడా తొలగిపోతాయని తెలిపారు. జగన్ బంధువుల్లోని స్త్రీల వల్ల ఆయనకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దానిని తట్టుకునే నేర్పరితనం జగన్కు రావాలని సిద్ధాంతి పేర్కొన్నారు. జగన్ మేక కాదని సింహమని తెలిపారు. కాగా.. అధికారంలో ఉన్నప్పుడు అట్టహాసంగా నిర్వహించిన ఉగాది వేడుకలు.. ఈ ఏడాది బోసిపోయాయి. వైసీపీ అధినేత జగన్.. బెంగళూరుకే పరిమితం కావడంతో కీలక నేతలు సైతం డుమ్మాకొట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ నాయకుల నుంచి కూడా పెద్దగా స్పందన కనిపించలేదు. అదేసమయంలో ఒకరిద్దరు నాయకులు.. సిద్ధాంతి నారాయణమూర్తి చెప్పింది విని అతిశయోక్తులు పలికారని పెదవి విరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి…
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News