IPLలో అల్లాడిస్తున్నా..? టీమిండియాలో ఛాన్స్‌లు రాకుండా ఎవరు తొక్కేస్తున్నారు?

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025లో ఏ మాత్రం అంచనాలు లేని అండర్‌ గాడ్‌ టీమ్‌ గుజరాత్‌ టైటాన్స్‌. కానీ, టోర్నీ మూడు వారాలు పూర్తి కావస్తున్న టైమ్‌లో.. ఆ జట్టే టేబుల్‌ టాపర్‌గా ఉంది. 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి.. 8 పాయింట్లతో ప్రస్తుతం టాప్‌ ప్లేస్‌లో కొసాగుతోంది. మరి పెద్దగా స్టార్లు లేని గుజరాత్‌ ఇంత సక్సెస్‌ అవ్వడానికి కారణం.. ఓ యంగ్‌ ప్లేయర్‌ కన్సిస్టెంట్‌గా పర్‌ఫామ్ చేయడమే. అఫ్‌కోర్స్‌ మిగతా టీమ్‌ అంతా బాగానే ఆడుతున్నా.. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ అనే కుర్రాడు జీటీకి బ్యాటింగ్‌లో బ్యాక్‌బోన్‌గా మారాడు. జట్టులో వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ ఉన్నప్పటికీ.. అతన్ని కాదని కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి జీటీ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టే అవకాశం సాయి సుదర్శన్‌కు ఎందుకిచ్చారో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది.

తన సూపర్‌ బ్యాటింగ్‌తో గుజరాత్‌కు విజయాలు అందిస్తున్న సాయి.. తాజాగా ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి స్టార్లు కూడా సాధించలేని రికార్డును ఈ 23 ఏళ్ల కుర్రాడు సాధించాడు. బుధవారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించాడు.. ఐపీఎల్‌లో 30 మ్యాచ్‌లు ఆడి 1300 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడిన షాన్‌ మార్ష్‌ మాత్రమే 30 ఐపీఎల్‌ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని.. 1300లకు పైగా రన్స్‌ చేశాడు. అతని తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో బ్యాటర్‌ సాయి సుదర్శనే.

ఈ సీజన్‌లోనే కాదు.. గత రెండు సీజన్లుగా సాయి అద్భుతంగా ఆడుతున్నాడు. మరి ఇంత బాగా ఆడుతున్నా.. సాయి సుదర్శన్‌కు రావాల్సినంత పేరు, టీమిండియాలో అవకాశాలు దక్కాయా అంటే మాత్రం.. ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మరి హైలీ టాలెంటెడ్‌ యంగ్‌ ప్లేయర్‌కు ఎందుకు ఛాన్సులు రావడం లేదు, తన తోటి క్రికెటర్లతో పోలిస్తే.. ఎందుకు వివక్షకు గురవుతున్నాడు? కావాలనే సాయి సుదర్శన్‌ను ఎవరైనా తొక్కేస్తున్నారా? అంటే.. ఒక విధంగా అవును అనే సమాధానమే వినిపిస్తోంది.

సాయి సుదర్శన్‌.. తమిళనాడుకు చెందిన లెఫ్ట్‌ ఆర్మ్‌ బ్యాటర్‌. తల్లిదండ్రులు కూడా క్రీడాల్లో పాల్గొన్నవారే. సాయి తండ్రి సౌత్‌ ఏషియా క్రీడల్లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్‌. అలాగే సాయి తల్లి వాలీబాల్‌ ప్లేయర్‌. తమిళనాడు తరఫున జాతీయ స్థాయిలో కూడా ఆడారు. ఇలా క్రీడలను ప్రేమించే కుటుంబం నుంచి వచ్చిన సాయి సుదర్శన్‌ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. సాయి టాలెంట్‌ బయటపడింది మాత్రం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనే. ఆ టోర్నీలో చేసిన ప్రదర్శన ఆధారంగానే అతనికి ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ దక్కింది. 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో సాయి సుదర్శన్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ.20 లక్షల బేస్‌ ప్రైజ్‌కు తీసుకుంది.

కానీ, ఆ తర్వాత అతను జీటీకి ఎంతో విలువైన ఆటగాడిగా మారిపోయాడు. ఐపీఎల్‌ 2025 సీజన్‌ కంటే ముందు జీటీ ఏకంగా రూ.8.50 కోట్లు చెల్లించి అతన్ని రిటేన్‌ చేసుకుంది. తన ఫ్రాంచైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. సాయి సుదర్శన్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 3 హాఫ్‌ సెంచరీలు బాదేశాడు. ఐపీఎల్‌లో సాయికి ఒక సెంచరీ కూడా ఉంది. అలాగే ఐపీఎల్‌ 2023 ఫైనల్‌లో 47 బంతుల్లో 96 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐపీఎల్‌లోనే కాకుండా.. డొమెస్టిక్‌ క్రికెట్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. 28 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 60.69 సగటుతో 1396 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 29 మ్యాచ్‌లు ఆడి 39.93 యావరేజ్‌తో 1957 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

డొమెస్టిక్‌ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఇంత బాగా ఆడుతున్నా.. సాయి సుదర్శన్‌కు ఎందుకు టీమిండియాలో అవకాశాలు పెద్దగా రావడం లేదు అనేది చాలా మందికి ఉండే డౌట్‌.. ఇప్పటి వరకు కేవలం టీమిండియా తరఫున 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. మూడు వన్డేల్లో 63.50 యావరేజ్‌తో 127 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇది అతని సూపర్‌ బ్యాటింగ్‌కు ఒక నిదర్శనం. ఆడిన ఒక్క టీ20లో అతనికి బ్యాటింగ్‌ రాలేదు. అయితే.. తన తోటి ఆటగాళ్లు అభిషేక్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, రుతరాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌ లాంటి వాళ్లతో పోటీ పడి, ఇన్‌ఫ్యాక్ట్‌ కొన్ని సార్లు వాళ్ల కంటే కూడా బెటర్‌గా ఆడుతున్నా.. సాయి సుదర్శన్‌ గుర్తింపు రావడం లేదు. గుర్తింపు సంగతి పక్కనపెట్టండి.. అంత పీఆర్‌ హడావిడి ఉన్న ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో ఆటతో సంబంధం లేకుండా హైప్‌ వస్తుంది. కానీ, టీమిండియాలో అవకాశాల విషయంలో మాత్రం సాయి సుదర్శన్‌కు కాస్త అన్యాయం జరుగుతోంది అనేది వాస్తవమే.

బట్‌.. మనోడికి జస్ట్‌ 23 ఏళ్లే కావడంతో ఇలానే ఆడుకుంటూ పోతే.. టీమిండియాలో పాతుకుపోకుండా అతన్ని ఎవరూ అడ్డుకోలేరు. కానీ, ప్రస్తుతానికైతే.. ముంబై లాబి, నార్త్‌ డామినేషన్‌ వల్ల సాయి సుదర్శన్‌కు రావాల్సినంత గుర్తింపు, ఛాన్సులు అయితే రాలేదనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో కాటేరమ్మ కొడుకులు అంటూ అభిషేక్‌ శర్మకు భారీ హైప్‌ వచ్చింది. అతను కూడా మంచి ఆటగాడే కానీ, అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వరుసగా విఫలం అవుతున్నాడు. అలాగే యశస్వి జైస్వాల్‌ కూడా ఫెయిల్‌ అవుతున్నాడు. కానీ, సాయి సుదర్శన్‌ మాత్రం కన్సిస్టెంట్‌గా రన్స్‌ చేస్తూ.. ది రియల్‌ కాటేరమ్మ కొడుకుగా మారుతున్నాడు. మరి ఇప్పటికైనా.. సాయి సుదర్శన్‌ విషయంలో సెలెక్టర్లు న్యాయంగా వ్యవహరిస్తారో లేదో చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights