హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోన్ చేసినా రెస్పాండ్ కారని.. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా సెటిల్మెంట్లు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. వంశీరాం బిల్డర్స్పై ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేనే పట్టించుకోకపోతే సామన్యుల పరిస్థితి ఏంటంటూ అనిరుధ్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.. అయితే.. అనిరుధ్ కామెంట్స్పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.. వంశీరాం బిల్డర్స్పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఫోన్ కాల్కు రెస్పాండ్ కాకపోయిన.. ఏవైనా ఫిర్యాదులు చేయాల్సి ఉంటే వాట్సాప్ మేసేజ్ చేసినా స్పందిస్తామని చెప్పారు.
అలాగే.. ప్రజాప్రతినిధులు చేసే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామని రంగనాథ్ పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తోందని ఆరోపించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. అందుకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే పోలీసులు, విజిలెన్స్ లేకపోతే ఏసీబీ దృష్టికి తీసుకెళ్లవచ్చని రంగనాథ్ అన్నారు.
తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదంటూ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రత్యక్షంగానీ పరోక్షంగా కానీ హైడ్రా పేరును వాడుకుని వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన శిక్ష పడేలా చేస్తామని రంగనాథ్ తెలిపారు. హైడ్రాకు కంప్లైంట్ వస్తే.. దశాబ్దాల సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం లభిస్తుందని చెప్పుకొచ్చారు.
కాస్త ఆలస్యమైనా.. తప్పకుండా తమ వద్దకు వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం చూపిస్తామని రంగనాథ్ తెలిపారు. ఆక్రమణలపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..