Hyderabad ORR Toll Charges: వాహనదారులకు అలర్ట్.. మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నారా? ఇక మీకు టోల్ బాదుడు మరింత పెరుగుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచుతూ, దాని నిర్వహణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్ మహానగరం చుట్టూ మెలికలు తిరుగుతూ సాగే.. ORRని రెండు భాగాలుగా విభజిస్తే.. ఒకటి పెద్ద అంబర్ పేట టు పటాన్చెరుగా చూడొచ్చు. ఇది దాదాపు 81.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని మీద ప్రయాణం.. గంటా పది నిమిషాలు పడుతుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్లో మరో ముఖ్య భాగంగా పటాన్చెరు టూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఎయిర్పోర్టుకు వెళ్లే వాళ్లు ఉంటారు.
ఔటర్ రింగ్ రోడ్లో మొత్తం 19 టోల్గేట్ల దాకా ఉన్నాయి. దీని మొత్తం పొడవు 158 కిలోమీటర్లు. ఇది 8 లేన్ ఎక్స్ప్రెస్ వే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ.. HMDA దీని నిర్వహణ చూస్తుంది. 2023లో IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్తో 30 సంవత్సరాల టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఇందుకు ఆ సంస్థ రూ. 7,380 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది.
పెరిగిన టోల్ చార్జీల వివరాలు:
కిలోమీటర్కు 4 నుంచి 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్లు, జీపులు, వ్యాన్ల వంటి తేలికపాటి వాహనాలు గతంలో కి.మీ. రూ. 2.34 – కొత్త రేటు కి.మీ. రూ. 2.44. కిలోమీటర్కు 10 పైసలు పెంచింది. అలాగే తేలికపాటి వాణిజ్య వాహనాలు, మినీ బస్సులు గతంలో కి.మీ. రూ. 3.77 – కొత్త రేటు కి.మీ. రూ. 3.93. కిలోమీటర్కు 16 పైసలు పెంచారు. అలాగే బస్సులు, ట్రక్కులకు గతంలో కి.మీ. రూ. 7.92 – కొత్త రేటు కి.మీ. రూ. 8.26. కిలోమీటర్కు 34 పైసలు పెంపు. యాక్సిల్ ట్రక్కులకు గతంలో కి.మీ. రూ. 10.22 – కొత్త రేటు రూ. 10.65 పెంచారు. కిలోమీటర్కు 43 పైసలు పెరుగుదల ఉంది.
ఇక భారీ నిర్మాణ యంత్రాలు, మల్టీ యాక్సిల్ ట్రక్కులకు గతంలో కి.మీ. రూ. 14.70 ఉండగా, కొత్త రేటు కి.మీ. రూ. 15.32. కిలోమీటర్కు 62 పైసలు పెంపు. ఇక యాక్సిల్, లేదా అంతకంటే పెద్ద వాహనాలకు గతంలో కి.మీ. రూ. 17.88 ఉండగా, కొత్త రేటు కి.మీ. రూ. 18.65. కిలోమీటర్కు 77 పైసలు పెరుగుదల ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి