హైదరాబాద్, మార్చి 24: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఓ వ్యక్తిని పాత కక్షల నేపథ్యంతో దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సోమవారం ఉదయం పట్టపగలు మరో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకెళ్తే..
చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్లో సోమవారం ఉదయం ఓ లాయర్ దారణహత్యకు గురయ్యాడు. అంబేద్కర్వాడలో న్యాయవాది ఇజ్రాయెల్ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాల పాలైన అతడిని వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయెల్ మృతి చెందాడు. అసలేం జరిగిందంటే..
అడ్వకేట్ ఇజ్రాయెల్ ఇంట్లో ఓ మహిళ కిరాయికి ఉంటున్నది. ఆమెను దస్తగిరి అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ గతకొంతకాలంగా వేధిస్తున్నాడని ఇజ్రాయెల్ను ఆశ్రయించింది. దీంతో బాధితురాలి తరఫున ఇజ్రాయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దస్తగిరి లాయర్ ఇజ్రాయెల్పై కక్షపెంచుకున్నాడు. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా? అంటూ దస్తగిరి ఈ రోజు ఉదయం అడ్వకేట్పై దాడిచేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదుచేసి నిందితుడిన అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఈ దారుణం చోటు చేసుకోవడంతో స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.