రెండు గంటల్లో రూ.15లక్షల లోన్ ఇస్తామంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు చీట్ చేశారు. అతని నుంచి ఏకంగా 45 లక్షలు కొట్టేశారు.. సికింద్రాబాద్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల ఆర్య వైశ్య బ్యాంక్ వాట్సాప్ గ్రూప్ పేరిట స్కామర్ల నుంచి మెసేజ్ వచ్చింది. అందులో మహాలక్ష్మి ఫైనాన్నుంచి రెండు గంటల్లో 15 లక్షల లోన్ ఇస్తామని మెసేజ్ ఉంది. నిజమేనని నమ్మిన ప్రైవేట్ ఉద్యోగి అందులో పేర్కొన్న ఫోన్ నంబరు కాల్ చేయగా సిబల్ స్కోర్ చాలా తక్కువగా ఉంది, దానితో సంబంధం లేకుండా లోన్ ప్రాసెస్చేయాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్కామర్లు చెప్పాడు. అందుకు ఒప్పుకోవడంతో గురుకృప ట్రేడర్స్ పేరుతో ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్ స్కామర్ పంపించాడు. లోన్ వస్తుందనే ఆలోచనలో ప్రైవేట్ ఉద్యోగి స్కామర్ అడిగినంత డబ్బు పంపించాడు. తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, చెఫ్ ను షేర్చేశాడు. లోన్ ప్రాసెసింగ్ విషయాన్ని సదరు ప్రైవేట్ ఉద్యోగి తన సోదరుడికి చెప్పగా, ఇదంతా స్కామ్ అని.. పంపిన వివరాలను వెంటనే డిలీట్ చేయమనడంతో మొత్తం డిలీట్ చేశాడు.
ఆ వెంటనే స్కామర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లోన్ ప్రాసెసింగ్లో ఉందని, పంపిన వివరాలు ఎందుకు డిలీట్ చేశారని దబాయించాడు. డిలీట్ చేసినందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని మరో యూపీఐ క్యూఆర్ కోడ్ పంపించాడు. ఫైన్ కింద కొంత డబ్బు వసూలు చేశాడు. తర్వాత ప్రైవేట్ ఉద్యోగి ఎస్బీఐ అకౌంట్ లో తగినంత బ్యాలెన్స్ లేదని మరోసారి ఫైన్ వసూలు చేశాడు. ఇలా మొత్తం 25 సార్లు ఫైన్ల పేరిట డబ్బు కొట్టేశాడు. లోన్ తోపాటు చెల్లించిన ఫైన్లు మొత్తం తిరిగి వస్తా యని చెప్పడంతో నిజమేనని నమ్మిన ప్రైవేట్ ఉద్యోగి అప్పు చేసి మరీ ఫైన్లు కట్టాడు. బ్యాంక్ హెడ్ ఆఫీసులో లోన్ ప్రాసెస్ లో ఉందని మరికొంత డబ్బు కట్టాలని తాజాగా స్కామర్ ఒత్తిడి చేశాడు. అడిగినంత ఇవ్వకపోతే లోన్ రిజెక్ట్ చేస్తామని బెదిరించాడు. చివరికి ఇదంతా స్కామర్ల పని అని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మొత్తం రూ.44లక్షల 83వేలు పోగొట్టుకున్నానని పేర్కొన్నాడు బాధితుడు.