Hyderabad: మటన్ కాదు కాలకూట విషం.. హైదరాబాదీలు జాగ్రత్త…

Written by RAJU

Published on:

Hyderabad: మటన్ కాదు కాలకూట విషం.. హైదరాబాదీలు జాగ్రత్త…

హైదరాబాద్‌ పాతబస్తీ అడ్డాగా మటన్‌ మాఫియా దందా నడుస్తోంది. మంగళ్‌హాట్ పీఎస్‌ పరిధిలో మటన్ నిల్వ ఉంచిన దుకాణాలపై సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 లక్షల రూపాయల విలువైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. A-2 జెడ్ మటన్ షాప్‌లో మాంసం నిల్వ ఉంచినట్లు సమాచారం తెలుసుకొని.. తనిఖీలు నిర్వహించారు. అక్కడ నెలల తరబడి మటన్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మహమ్మద్‌ అఫ్రోజ్ అనే వ్యక్తి.. మాంసాన్ని చాలా రోజులు నిల్వ చేసి హోటళ్లు, ఫంక్షన్‌లకు సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరోవైపు డబీర్‌పురాలో కుళ్లిన మాంసాన్ని ఫ్రీజర్‌లో నాలుగు నెలలుగా నిల్వ ఉంచినట్లు టాస్క్‌ఫోర్స్ టీమ్‌ గుర్తించింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసం తీసుకొచ్చి, ఇక్కడ అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. డబీర్‌పురాలో 2 క్వింటాళ్ల కుళ్లిన మాంసం స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలతో కల్తీ కేటుగాళ్ల పని పడుతున్నారు పోలీసులు.

జనానికి హానికరమైన మాంసం అమ్మేవారిని ఉపేక్షించేది లేదంటున్నారు టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు. దుకాణాల నుంచి మాంసం కొనుగోలు చేసే ముందు.. అది ఎక్కడ నుంచి వచ్చింది? సరైన ప్రమాణాలతో ఉందా లేదా అనేది తెలుసుకోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

అసలు ఈ మటన్‌… హైదరాబాద్‌కి ఎలా వస్తోందో తెలుసుకుందాం. ఉత్తరాదిలో గొర్రె తల, కాళ్లు పెద్దగా తినరు. అక్కడి వేస్టేజీని ఇక్కడకు తరలిస్తుంది మటన్‌ మాఫియా. కుళ్లిన మాంసం నెలల తరబడి ఫ్రీజర్‌లో నిల్వ చేసి.. నగరంలోని పలు క్యాటరింగ్ ఏజెన్సీలు, బార్ అండ్ రెస్టారెంట్స్‌, రోడ్ సైడ్ హోటల్స్‌కు సరఫరా చేస్తున్నారు. వాసన రాకుండా వెనిగార్‌తో మేనేజ్‌ చేస్తున్నారు. ఇదే మటన్‌తో హలీం కూడా తయారు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

మరోవైపు హైదరాబాద్‌లోని హోటల్స్, కేఫ్స్‌పై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు రెయిడ్స్‌ చేస్తున్నారు. గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్, మాదాపూర్‌లోని క్షత్రియ ఫుడ్స్, తుర్కయంజాల్‌లోని హోటల్ తులిప్ గ్రాండ్‌..ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక వరలక్ష్మి టిఫిన్స్ కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు తిరుగుతున్నాయి. కుకింగ్ ఆయిల్ ని రిపీటెడ్‌గా వాడుతున్నట్లు తేలింది. ఇక కిచెన్‌లో పనిచేసేవారు, పాన్ మసాలా, గుట్కాలు నములుతూ వంటలు చేస్తున్నారు.

హోటల్ తులిప్ గ్రాండ్‌లో కుళ్లిపోయిన చికెన్‌, గడువు దాటిపోయిన మష్రూమ్స్, ఐస్ క్రీమ్‌ను స్టోర్ చేసినట్లు గుర్తించారు. ఇక క్షత్రియ ఫుడ్స్‌ నిర్వాహకులు…నాన్‌వెజ్‌ వంటకాల్లో సింథటిక్ ఫుడ్‌ కలర్స్‌ వాడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 

Subscribe for notification