హైదరాబాద్ మహానగరంలో పోకిరీలు రెచ్చిపోయారు. మద్యం మత్తులో చుక్కలు చూపించారు. కాబోయే భార్యతో మాట్లాడుతుండగా అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులు.. కారులో నుంచి యువతిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు వారి కారును వెంబడించి మరి వేధింపులకు గురిచేశారు. కారును ధ్యంసం చేయడమే కాకుండా వీరంగం సృష్టించారు యువకులు.
దాదాపు కిలోమీటర్ వరకు కారుపై యువకులు రణరంగం సృష్టించారు. ఎలాగైనా కాబోయే భార్యను కాపాడాలని తీవ్ర ప్రయత్నం.. వేగంగా కారు నడపడంతో ఒకరు కారు పై నుంచి దూకి పారిపోయాడు. మరోకడు అద్దంపై కూర్చోవడంతో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి ఆగిపోయింది. హైదరాబాద్ నగరంలోని మలక్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
హిల్స్ గ్రౌండ్ వద్ద హయత్ నగర్కు చెందిన వంశీ కృష్ణ అనే యువకుడు సైదాబాద్కు చెందిన తన కాబోయే భార్యతో కలసి మార్చి 18వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో కారులో మాట్లాడుతుండగా ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారు దగ్గరికి వచ్చి కారు అద్దాలు తీయాలని భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో వంశీ కృష్ణ కారును స్టార్ట్ చేసి వెళ్లే క్రమంలో కారుపై ఇద్దరు దుండగులు కూర్చుని కారు అద్దాలు పగలగొట్టారు. భయబ్రాంతులకు గురైన వంశీ కృష్ణ కొద్దీ దూరం అలాగే కారు ప్రయాణం చేశాడు. ఇంతలో కారుపై ఉన్న ఓ దుండగుడు దూకి పారిపోయాడు. మరోకడు కారు బానెట్ పై కూర్చోవడంతో ముందు ఏమి కనిపించకపోవడంతో రెండు ద్విచక్ర వాహనాలను డీ కొట్టాడు. బానెట్పై ఉన్న దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ఇదిలావుంటే, ద్విచక్ర వాహనదారులు వంశీ కృష్ణను కొట్టి పోలీసులకు అప్పజెప్పారు. దీంతో పోలీసులు ఆక్సిడెంట్ కేసు నమోదు చేశారు. కానీ బాధితుడు రోడ్డు ప్రమాదం జరగడానికి కొందరు దుండగులు వెంబడించడమే ప్రధాన కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇదేం పట్టించుకోని పోలీసులు తనపై కేసు పెట్టి వేధిస్తున్నాడని వంశీ కృష్ణ ఆరోపిస్తున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, భయందోళనలకు గురించేసిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..