
ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం సాయంత్రం మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో 19 ఏళ్ల యువతిపై ఓ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఓ ప్రవేట్ ఉద్యోగిని. వర్క్ ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా నిందితుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దుండగుడు వెనుక నుండి వచ్చి లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఆకతాయి చెంపపై గట్టిగా కొట్టి.. అరవడవంతో.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిర్యాదు ఆధారంగా, మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తదుపరి చర్యల కోసం కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులకు బదిలీ చేస్తారు. BNS సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసినట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
మార్చి 22న కూడా ఓ యువతికి ట్రైన్లో ఈ తరహా వేధింపులే ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి MMTS ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె భయంతో రైలులోనుంచి బయటకుదూకేసింది. కంకర రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్పృహతప్పి పడిపోయిన బాధితురాల్ని అటువైపు వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. యువతి సికింద్రాబాద్లో తన మొబైల్ ఫోన్ డిస్ప్లే రిపేర్ చేయించుకుని మేడ్చల్కు తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.