హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసు బలగాలను ఉపసంహరిచాలని, వన్యప్రాణుల సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని హెచ్సీయూ వీసీ బీజేరావుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం లేఖ రాశారు. హెచ్సీయూ కంచె గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(సోమవారం) సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ సీసీ, ప్రొఫెసర్ శ్రీపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్యా భూక్య, పౌర సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్కుమార్, ఎన్ఏపీఎం, వి.సంధ్య, డబ్ల్యూటీజేఏసీ కే. సజయ, డబ్ల్యూటీజేఏసీ, ఇమ్రాన్ సిద్ధిఖీ, సీడబ్ల్యూఎస్ ఇండియా తదితరులు హెచ్సీయూలో మోహరించిన పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు మంత్రుల బృందానికి వారు వినతిపత్రం సమర్పించారు.
మంత్రుల కమిటీ సానుకూలం..
వారు చేసిన విజ్ఞప్తితో మంత్రుల సబ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. సబ్ కమిటీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్సీయూ విద్యార్థులు అధ్యాపకులు, రిజిస్టార్ గతంలో చేసిన విజ్ఞప్తిని క్రోడీకరిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్కు లేఖ రాశారు. హెచ్సీయూ స్వయం ప్రతిపత్తి, బోధన, పరిశోధనలకు సురక్షితంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వానికి అచంచల విశ్వాసం ఉందని పునరుద్ఘాటిస్తున్నామని అన్నారు. 2- 04 – 2025న యూనివర్సిటీలో శాంతి భద్రతలు, విద్యార్థులు అధ్యాపకుల భద్రతకు క్యాంపస్లో పోలీసులను అందుబాటులో ఉంచాల్సిందిగా హెచ్సీయూ రిజిస్ట్రార్ కోరారని మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో..
ఆ మేరకు గతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఉపాధ్యాయ జేఏసీ, పౌర సంఘం సభ్యుల విజ్ఞప్తికి స్పందించి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను మినహాయించి మెయిన్ క్యాంపస్ సమీపంలో పోలీస్ బందోబస్తును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 400 ఎకరాలు ఉన్న కంచ గచ్చిబౌలిలో చెట్ల సంరక్షణ తప్ప ఏ ఇతర కార్యకలాపాలకు అనుమతించబోమని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
చర్చలకు సిద్ధం…
క్యాంపస్లో కార్యకలాపాలు శాంతియుతంగా జరిగేలా హెచ్సీయూ సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. హెచ్సీయూ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే పోలీసులను ఉపసంహరిస్తామని తెలిపారు. హెచ్సీయూకు సంబంధించిన అంశంలో అందరితోనూ చర్చలకు ప్రభుత్వ౦ ఎల్లవేళలా సిద్ధంగా ఉందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ పక్షాన హెచ్సీయూ అధికారులు హామీ ఇవ్వాలని అన్నారు. విద్య, నైపుణ్యం సామాజిక బాధ్యత సాధించడంలో యూనివర్సిటీకి తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి పని చేయడానికి సదా సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి…
HCU Land Dispute: హెచ్సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే
HCU Row: భూ వివాదంపై భేటీ.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 07 , 2025 | 09:50 PM