తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్కుమార్ బంగారు చీరను మగ్గంపై నేసి అందరినీ ఔరా అనిపించాడు. ఓ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం 20 గ్రాముల బంగారంతో గోల్డ్ చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలొ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలు నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన నల్లా పరందాములు కుమారుడే ఈ విజయ్ కుమార్.
అయితే కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఓ వ్యాపారవేత్త.. తన కుమార్తె వివాహం కోసం చీర కావాలని నేతన్న విజయ్ను సంప్రదించాడు. విజయ్ అతనికి కొన్ని చీరల డిజైన్లు చూపించాడు. అందులోంచి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్న ఆయన బంగారంతో ఆ చీరను నేయాలని అన్నారు. వ్యాపారి కోరిక మేరకు 20 గ్రాముల బంగారంతో 5.5 మీటర్ల పొడవు, 48 ఈంచుల వెడల్పు, 800 గ్రాములు బరువు కలిగిన చీరను విజయ్ తయరు చేశారు. విజయ్ పది రోజులు శ్రమించి బంగారు పూల డిజైన్తో అద్భుతమైన చీరను మగ్గంపై నేశారు. ఈ చీర ఖరీదు సుమారుగా 2లక్షల 80 వేల పైగా ఉంటుందని ఆయన తెలిపారు.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నల్లా విజయ్ కుమార్ 2012 నుంచి మగ్గాలపై వినూత్న ప్రయోగాలు చేస్తూ అనేక అద్భుతాలను సృష్టించాడు. ఉంగరం నుంచి దూరే చీరతో మొదలుకొని, కుట్టులేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చి, పైజామా, అరటి నారలతో శాలువా, తామరలతో చీర, వెండి కొంగుతో చీర, మూడు కొంగుల చీర, 220 రంగులతో చీరలను నేయడం వంటివి విజయ్ క్రియేట్ చేసిన అద్భుతాలు, ఇవే కాకుండా ఎన్నో కొత్త రకాల చీరలు, వస్త్రాలను విజయ్ మార్కెట్లోకి తీసుకువచ్చారు. విజయ్ చేసిన ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఇతనికి ఆర్డర్స్ వస్తుంటాయి. అమెరికా, న్యూజిలాండ్, బెంగళూరుకు చెందిన వస్త్ర వ్యాపారులు నేరుగా ఆర్డర్ ఇచ్చి విభిన్న రకాల వస్త్రాలను విజయ్ వద్ద తయారు చేయించుకుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..